వైఎస్‌ వివేకానందరెడ్డి హ‌త్య ఉదంతంలో వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచార‌ణే స‌రైన ప‌రిష్కారమ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వివేకా హత్య వెనుక టీడీపీ నేత‌ల‌ హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీపై త‌మకు నమ్మకం లేదని, అందుకే సీబీఐ విచార‌ణ కోరుతున్నామ‌న్నారు. సిట్‌ చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తుందని, అందుకే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. గతంలో వైఎస్ జగన్‌ను కూడా హతమార్చడానికి కూడా ప్ర‌య‌త్నించారన్నారు. 


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నిందన్నారు. 1998 నుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. రాజారెడ్డి హత్యలో సైతం టిడిపి ప్రమేయం ఉందని, హంతకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్షణ కల్పించారని ఆయ‌న ఆరోపించారు. వైఎస్ జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో హత్యయత్నం చేస్తే అందులో టిడిపి వారే నిందితులుగా ఉన్నారు. పోలీసు వ్యవస్దనంతటిని గత ఐదు సంవత్సరాలుగా భ్రష్టుపట్టించారు అని ఆరోపించారు.


గత ఐదేళ్లలో రాష్ర్టంలో జరిగిన ప్రతి హత్యలో కూడా టిడిపి పాత్ర ఉందని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. ``చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా హత్య చేసి ఆ కేసును నీరుగార్చారు. రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సిట్ డీజీపీ ఆద్వర్యంలోనే పనిచేస్తుంది.ఆ డిజిపైనే మాకు నమ్మకం లేనప్పుడు ఆ సిట్ ఏరకంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఎవరైతే ఈ హత్య చేసారో వారిని చట్టానికి అనుగుణంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.


వైఎస్సార్ కుటుంబాన్ని అంతమొందించాలనే కుట్రలో భాగంగా వివేకానందరెడ్డి హత్య జరిగిందని విజ‌యసాయిరెడ్డి ఆరోపించారు. ``ఇందులో మంత్రి ఆదినారాయణరెడ్డి,చంద్రబాబు,లోకేష్ ల పాత్ర ఉంది.హత్యా  కుట్రను అమలు చేసింది మంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకానందరెడ్డి కి కుటుంబకలహాలు ఏమి లేవు,జమ్మలమడుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా వివేకానంద రెడ్డి పనిచేస్తున్నారు. వైఎస్సార్ కుటుంబంలో ఆయన కుటుంబపెద్ద.ఆయన ముందు దిశానిర్దేశం చేస్తా వచ్చారు. ఏనాడు ఆయన లోక్ సభకు పోటీ చేస్తానని అనలేదు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో వివేకానందరెడ్డి పనిచేస్తున్నారు. అయితే, కావాల‌నే తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది`` అని మండిప‌డ్డారు. 


డీజీపీ మార్పును ఇప్పుడే కాదు గతంలోనే మేం డిమాండ్ చేశామ‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ``బీజేపీ, టీడీపీకి అనుభందం కొనసాగుతున్నందువల్లనే డిజిపి మార్పు జరగలేదు.డిజిపి టాగూర్ చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తుతున్నాడు. షెడ్యూల్ ప్రకటనకు ముందు కూడా డిజిపిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. తెలుగుదేశం పార్టీ తెలుగుడ్రామాల పార్టీ,తెలుగుదొంగల పార్టీ ఇప్పుడు తెలుగుహంతకుల పార్టీగా మారింది. మాకు అందిన సమాచారం ప్రకారం.అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు .ఉదయం అందరూ కూడా గుండెపోటు అన్నారు.

పోస్టు మార్టం వచ్చాక హత్య అనే భావన కలిగింది. హత్య అని నిర్దారణ అయింది.అందుకే నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుతున్నాం. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఓ హంతకుడు.హంతకుడే ఆరోపణలు చేయడం ఏంటి? ఎన్ని మర్డర్లు చేయించారో అందరికి తెలుసు. స్వర్గీయ రాజారెడ్డిగారి హత్య ఎన్నికలకు ముందు జరిగింది.వైయస్ రాజశేఖరరెడ్డి మృతి ఎన్నికల తర్వాత నాలుగునెలలకు జరిగింది. ఆయనకున్న ఆదరణ చూడలేక ఎలిమినేట్ చేయడం జరిగింది.
నేడు వివేకానందరెడ్డిగారు ప్రజలతో మమేకం అయి పనిచేస్తారని తెలుసు. ఆయన ఉంటే అక్కడ ఆదినారాయణరెడ్డి రాజకీయమనుగడకు ప్రమాదం అని ఎలిమినేట్ చేయడం జరిగింది.ఇదంతా ఓ వ్యూహంతో  తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది`` అని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: