కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలకు అధిష్ఠానం మళ్లీ ఝలక్ ఇచ్చింది. స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ ఏడాది కాలం నుంచే అసమ్మతిని ఉధృతం చేసిన నేతలు చివరికి స్థానికేతరుడైన మంత్రి జవహర్ను అక్కడి నుంచి జరపడంలో సఫలమయ్యారనే చెప్పాలి. అయితే జవహర్ను వెళ్లగొట్టామన్న ఆనందం సదరు నేతల్లో పట్టుమని మూడు రోజులు కూడా నిలవలేదు. ఎందుకంటే అధిష్ఠానం మళ్లీ స్థానికేతర అభ్యర్థినే బరిలోకి దించడం వారికి రుచించడం లేదు. విశాఖ జిల్లా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు ఇక్కడ అకామిడేషన్ చేయడం జరిగింది. వాస్తవానికి చంద్రబాబు కొవ్వూరు నేతలతో అమరావతిలో సమీక్ష నిర్వహించిన సమయంలో నియోజకవర్గ నేత అచ్చిబాబు ఐదుగురు స్థానిక నేతలతో కూడిన జాబితాను అధినేతకు అందజేశారు.
జాబితాలోని నేతల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా తామంత కలసి అభ్యర్థిని గెలిపించుకుంటాని చెప్పారట. దీంతో అచ్చిబాబు ప్రతిపాదనలకు ఒకే చెప్పిన బాబు అలాగే చేస్తానని మాట కూడా ఇచ్చారట. తీరా చేస్తూ అనుహ్యంగా మళ్లీ స్థానికతరులకే టికెట్ కేటాయించడంపై స్థానిక నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. టీడీపీ అధిష్ఠానం మమ్మల్ని కించపరించిందంటూ ఆగ్రహం వెల్లగక్కుతున్నారట. ఇది ఇలా ఉండగా స్థానికేతరుడంటూ తనను వెళ్లగొట్టిన అసమ్మతి నేతలకు తగిన శాస్తియే జరిగిందంటూ మంత్రి జవహర్ విమర్శిస్తుండటం కొసమెరుపు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికి పార్టీలో అసమ్మతితోనే కదలాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయన అంతరంగీకుల వద్ద అంగీకరించారని సమాచారం.
ఇక పార్టీ ఆవిర్భావం మొదలు 1999లో మినహా అన్నిసార్లు టీడీపీయే విజయం సాధిస్తూ వచ్చింది. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు స్థానికేతర నేతల మధ్య గట్టి పోటీ నెలకొందని సమాచారం. ఆ కోవలోనే అనిత టికెట్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక అచ్చిబాబును కూడా మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు వ్యూహాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అచ్చిబాబు వర్గానికి ఏదైనా సమాన పదవి ఇస్తామనే హామీ లభించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న అనిత స్థానిక నేతలతో ఎలా కలసి పనిచేయబోతున్నారనేది ఇప్పుడు నియోజకవర్గ నేతల్లో హాట్ టాపిక్గా మారింది. సీనియర్లను లెక్క చేయరని, ఉద్యోగులను దూషిస్తారనే అపవాదు ఆరోపణలైతే ఆమెపై ఉండటం గమనార్హం.