అయితే రావెల పార్టీ మారడంతో టీడీపీ ఇంతకాలం సారైనా అభ్యర్ధి కోసం ఎదురుచూసి....సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ని ప్రత్తిపాడు బరిలోకి దించింది. గతంలో కాంగ్రెస్ హయాంలో డొక్కా మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన వలన కాంగ్రెస్ దెబ్బతినడంతో...డొక్కా టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మృదు స్వభావిగా డొక్కాకి గుంటూరులో మంచి పేరే ఉంది. ప్రత్తిపాడులో టీడీపీకి మంచి క్యాడర్ కూడా ఉంది. అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడ బాగానే అమలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ సభ్ ప్లాన్ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లుతో పాటు పలు ప్రాజెక్టులు చేపట్టి నియోజకవర్గం అభివృద్ది పథంలో నడిచింది. అయితే ఎన్నికలకీ ఎక్కువ సమయంలేని పరిస్థితుల్లో ప్రత్తిపాడు ప్రజలు డొక్కాకి ఏ మేర మద్ధతు తెలుపుతారో చూడాలి.
అటు వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుండి, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన సుచరితకి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఆమె ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లింది. అలాగే పార్టీ కార్యక్రమాలన్నీ చురుగ్గా చేస్తూ ప్రజల మధ్యే ఉన్నారు. అయితే సీనియర్ నేత డొక్కా ఇక్కడకి రావడం, జనసేన ఓట్లు చీల్చే అవకాశం ఉండటం సుచరితకి ఇబ్బందే.
కాగా, ప్రత్తిపాడులో ఎస్సీలు(మాలలు 40 వేలు, మాదిగలు 20వేలు) ఎక్కువగా ఉండగా...ఆ తరువాత కమ్మ సామాజిక వర్గం 45 వేలు ఉన్నారు. అలాగే కాపు సమాజిక వర్గం 40వేలు వుండగా రెడ్డి సామాజిక వర్గం 18 వేలు, ముస్లింలు 12 వేల మంది వున్నారు. అయితే ఎస్సీలు, కమ్మ, కాపులే ఇక్కడ కీలకం కానున్నారు.