సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ మ‌రో పొత్తు పెట్టుకుంది. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌రిలో దిగుతున్న జ‌న‌సేన తాజాగా మ‌రో జాతీయ పార్టీతో క‌లిసి ముందుకు సాగేందుకు నిర్ణ‌యం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో క‌లిసి పోటీ చేయాల‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్య‌క్షురాలు మాయ‌వ‌తి నిర్ణ‌యించారు.


ల‌క్నోలో శుక్ర‌వారం ఉద‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాయ‌వ‌తిని క‌లిసి సుదీర్ఘంగా చ‌ర్చించారు. రెండున్న‌ర గంట‌లపాటు సాగిన ఈ చ‌ర్చ‌ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని మాయ‌వ‌తి గారు ఆశాభావం వ్య‌క్తం చేశారని జ‌న‌సేన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ''ఆంధప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం''  అని మాయావతి గారు చెప్పారు.

పూర్తి స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణంలో ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. బీఎస్పీ ఏయే స్థానాల నుంచి పోటీ చేసేది రెండు, మూడు రోజుల్లో  వెల్ల‌డిస్తారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో మాయ‌వ‌తి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల స‌భ‌ల్లో పాల్గొంటారు. 
ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాట్లాడుతూ మాయ‌వ‌తి క‌ష్టించి పైకొచ్చిన నేత అన్నారు.

ఆమెకు ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసు అన్నారు. సోద‌రి స‌మానురాలైన మాయ‌వ‌తిని మ‌న దేశానికి ప్ర‌ధానమంత్రిగా చూడాల‌ని నా దృఢ‌మైన కోరిక అన్నారు. ఆమె తప్పక ప్ర‌ధాన‌మంత్రి అవుతారని  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆకాంక్షించారు. జ‌న‌సేన పార్టీ కొత్త పొత్తుల చ‌ర్చ స‌ఫ‌లం అవ‌డంతో పాటుగా పదవుల విష‌యంలో ఇద్ద‌రు నేత‌ల నుంచి కీల‌క‌మైన అభిలాష వెలువ‌డింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: