గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగా గీత పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గీత తాజాగా వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ, టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ అధినతే వైఎస్ జగన్ను సీఎం చేసేందుకు పనిచేస్తానని ఆమె ప్రకటించారు.
అయితే, గీత చేరికతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాకినాడ ఎంపీ స్థానానికి వంగా గీత పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇటీవలే పార్టీ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరిన నేపథ్యంలో ఇక్కడి బెర్త్ గీతకు దక్కవచ్చని అంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సీటుపై స్పష్టత రానుంది.
ఇదిలాఉండగా, గీత మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన నేపథ్యంలో వైసీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ను సీఎం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
వైసీపీలోకి భారీ వలసలు..నేతలతో లోటస్ పాండ్ కిటకిట :
ఏపీలో ప్రధానప్రతిపక్షమైన వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు ఫ్యాన్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తిరిగి పార్టీలోకి రానున్నారు. ఆమెతో పాటుగా కొణతాల రామకృష్ణ, ఆదాల ప్రభాకర్, మాగుంట సుబ్బరామిరెడ్డి, వంగాగీత, బుట్టా రేణుక వేర్వేరుగా పార్టీలో చేరనున్నారు. గూడూరు నుంచి టీడీపీ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్ పార్టీలో చేరనున్నారు.
ఈ మధ్యాహ్నం పులివెందుల నుంచి వైఎస్ జగన్ హైదరాబాద్ రానున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో నేతలు చేరనున్నారు. కాగా, నేతల చేరిక ప్రక్రియ అనంతరం ఆదివారం వైఎస్ జగన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ప్రాథమిక కసరత్తు పూర్తిచేసిన వైసీపీ అధ్యక్షుడు తాజా మరోమారు అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని జాబితా వెలువరించనున్నారు. దీంతోపాటుగా ఇప్పటికే ప్రచార షెడ్యూల్ ఖరారు చేసిన జగన్ ఈ టూర్పై తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా వెల్లడించనున్నారు.