రేగులపాటి రమ్యారావు...టీపీసీసీ అధికార ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీలో ఎందరో అధికార ప్రతినిధులు నాయకులు ఉండగా ఆమె గురించి ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందంటే...టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న కూతురు కాబట్టి! కేసీఆర్ అన్న కూతురు కాంగ్రెస్లో చేరడం, పైగా ఇంతటి ముఖ్యమైన పదవిలో ఉండటమే ఆసక్తికరమే.
అయితే, తాజాగా కాంగ్రెస్లో తన పదవికి రాజీనామా చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కేసీఆర్ కుటుంబ సభ్యురాలు అయినప్పటికీ ఆ కుటుంబంతో ఆమెకు సరైన సంబంధాలు లేవు. రమ్యారావు గతంలో కలకంల రేపే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ తమిళనాడులో సంచలన రాజకీయాలకు కారణమైన శశికళ వంటి కోటరి ఉందని, చిన్నమ్మ సారథ్యంలో నడిచి మన్నార్ గుడి మాఫియా కుట్రలవలే కేసీఆర్పై సైతం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. తమిళనాడులో మన్నారుగుడికి చెందిన శశికళ కోటరీ జయలలితను పొట్టన పెట్టుకుంటే .. తెలంగాణ లో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియా పొట్టన బెట్టుకునే ప్రమాదం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కుదురుపాక శశికళ వర్గానికి ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యురిటీ ఎలా కలిపిస్తారని ఇటీవల ఎంపీ కవితకు భద్రత పెంపు నిర్ణయాన్ని రమ్య ప్రశ్నించారు.
అలా వ్యాఖ్యలు చేసిన రమ్యారావు కొద్దికాలం క్రితం వేములవాడ టికెట్ కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడ్ని కలుసుకున్నారు. అమరావతి వెళ్లిన కేసీఆర్ అన్న కూతురు ఉండవల్లిలోని సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న రమ్యారావు బాబుతో సమావేశం అవడం సహజంగానే రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలా రకరకాల పరిణామాలతో తెరమీదకు వచ్చిన రమ్యారావు తాజాగా, తన పదవికి గుడ్బై చెప్పారు. అయితే, తన పదవికి రాజీనామా గురించి ఆమె కారణాలు వెల్లడించలేదు.