అనంత పురం 2014ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ ప్రభంజనం రేపింది. వైస్సార్సీపీ ఘోరంగా దెబ్బ తిన్నది. పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం రెండింటిలోనే వైసీపీ గెలిచింది. పన్నెండు సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మరో ఎమ్మెల్యేను ఫిరాయింపజేసి తమ నంబర్ను పదమూడుకు పెంచుకుంది తెలుగుదేశం పార్టీ. ఇక ఇదే సమయంలో చెప్పదగిన అంశం ఏమిటంటే.. గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా కష్టపడిన నేతలు కూడా అనంతపురం జిల్లాలోనే కనిపిస్తూ ఉన్నారు.
పుట్టపర్తి, శింగనమల, ధర్మవరం, రాప్తాడు, కదిరి, గుంతకల్, రాయదుర్గం నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తరఫున ఇన్చార్జిలు గట్టిగా కష్టపడ్డారు. అలా కష్టపడిన వారికే టికెట్లు ఖరారు అయ్యాయి కూడా. అనంతపురంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది రుణమాఫీ హామీ. అది అమలు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో గత ఎన్నికల ఫలితాలు పునరావృత్తం అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావింపబడుతున్న ఈ జిల్లాలో కనీసం సగం స్థానాలను లేదా.. అంతకు మించి కూడా తాము సాధించగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లాలో జగన్ పార్టీ ఏడు లేదా ఎనిమిది అసెంబ్లీ సీట్లను నెగ్గగలిగితే మాత్రం రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభంజనం ఖరారు అయినట్టే!