మనోహర్ పారికల్.. విలక్షణ నేత.. ఆర్ఎస్ఎస్ లో మొదలైన ఆయన ప్రస్థానం దేశ రక్షణశాఖ మంత్రి వరకూ వెళ్లింది. గోవా ముఖ్యమంత్రిగానూ తనదైన ముద్ర వేశారు. దేశంలో ఐఐటీలో చదువుకుని ముఖ్యమంత్రి అయ్యింది బహుశా మనోహర్ పారికర్ ఒక్కరే కావచ్చు.
మనోహర్ పారికర్ గురించి చెప్పమంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నిరాడంబరత. ఆ తర్వాత కమిట్మెంట్. అంతే కాదు.. అంతులేని ధైర్యం కూడా. పైకి ఎంతో సౌమ్యుడిగా కనిపించినా కార్యశూరత్వం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా.. ఆయన భారత రక్షణ మంత్రిగా వ్యవహరించినప్పుడు తనదైన ముద్ర వేశారు.
ఆయన రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే… 2016 సెప్టెంబరులో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొదటి సారి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించింది. యూరీ సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి ఘటన తర్వాత మనోహర్ పారికర్ భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పాక్ కు తగిన బుద్ది చెప్పేలా సర్జికల్స్ స్ట్రయిక్స్ కు రూపకల్పన చేయించారు.
ఆయన మార్గదర్శకత్వంలోనే.. భారత ఆర్మీ.. కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని సత్తా చాటింది. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత భారత ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరిగింది. సర్టికల్ స్ట్రయిక్స్ విషయంలోనే కాదు.. సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉంచే విషయంలో కూడా పారికర్ చొరవ తీసుకున్నారు.