ఒంగోలు ఎంపీ సెగ్మెంట్లో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం వరకు కలసి పనిచేసిన నేతలిద్దరూ త్వరలో ప్రత్యర్థులుగా తలపడనుండటమే ఇక్కడ విశేషం. మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇక్కడ మంచి పేరు ఉంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ సారి టీడీపీ నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఎప్పుడో ఖాయం చేసినప్పటికి ఆయన మాత్రం చంద్రబాబుకు ఝలక్ ఇస్తూ వైసీపీ కండువా కప్పుకోవడం విశేషం. వాస్తవానికి ఇక్కడ మాగుంట ఫ్యామిలీకి మంచి రాజకీయ చరిత్ర ఉంది. సుదీర్ఘకాలం పాటు వారి కుటుంబం కాంగ్రెస్లో కొనసాగింది. 1990 నుంచి వారి ఫ్యామిలీ ఇక్కడ విజయం సాధిస్తూ వస్తోంది.
మాగుంట శ్రీనివాసులురెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి ఇక్కడ 1991-96 మధ్య ఎంపీగా పనిచేశారు. ఆయన హత్య అనంతరం సతీమణి పార్వతమ్మ పోటీ చేసి గెలిచారు. ఆమె 1996-98 మధ్య పనిచేశారు. ఇక తల్లిదండ్రుల వారసత్వంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1998 నుంచి 1999వరకు ఎంపీగా పనిచేశారు. అటు తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక మళ్లీ 2004లో , 2009 ఎన్నికల్లో ఆయన రెండుసార్లు వరుస విజయాలతో సత్తా చాటారు. అందరిని కలుపుకుపోతాడు..సౌమ్యుడు..వివాదారహితుడు అనే పేరు ఉంది.ఈ కారణాల చేతే గత ఎన్నికల ముందు కొద్దిరోజుల ముందు వచ్చినా శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు ఒంగోలు టికెట్ కేటాయించారు.
అయితే ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు గౌరవంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవితో పాటు ఎమ్మెల్సీగా నియమించారు. ఆయనకు చాలా ప్రాధాన్యమిచ్చారని చెప్పాలి. అయితే శ్రీనివాసులురెడ్డి మాత్రం కొద్ది రోజుల క్రితం వైసీపీ తీర్థం తీసుకోవడంతో చంద్రబాబు సహ ఇతర పార్టీ నేతలు కంగుతిన్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి మంత్రి శిద్దా రాఘవరావును పోటీ చేయించేందుకు చంద్రబాబు ఒప్పించారు. శిద్దాకు కూడా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మంచి పట్టు ఉంది. రాజకీయంగా జిల్లాలో ఉద్ధండుడిగా చెప్పాలి. శిద్దా ప్రస్తుతం దర్శి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.
అంతేకాక పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఏవిధంగా చూసుకున్నా ఆయనకు పార్టీలో తిరుగులేదనే చెప్పాలి. ఆయనకు సొంతంగా ఓటు బ్యాంకు కలిగి ఉంది. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో శిద్ధా సామాజిక వర్గం ఓటర్లతో పాటు బీసీ ఓటర్లు, టీడీపీకి కలిసొచ్చే ఓటింగ్ లెక్కలతో శిద్ధా ఉత్సాహం మీద ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాత నేతల మధ్య గట్టి పోటీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో జరిగే బిగ్ఫైట్ సీట్లలో ఇది కూడా ఒకటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.