ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచేశారు. టికెట్ల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ప్రచారంపై ఇక దృష్టి సారించారు. తిరుపతితో మొదలు పెట్టి ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచార రంగాన్ని వేడెక్కించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేశారు. ముందుగా పార్టీ కార్యకర్తలను యుద్దానికి సిద్ధం చేస్తున్నారు. డ్వాక్రామహిళలు, సేవామిత్రలు, పార్టీ బూత్ కన్వీనర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో మాట్లాడారు. మీ భవిష్యత్తు నా బాధ్యత నినాదంతో వారిని ఉత్తేజపరిచారు. కేసీఆర్ అంటే జగన్కే భయమని, తనకేం భయం లేదని స్పష్టం చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తెదేపాకే ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు.
ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబులా పని చేయాలంటూ ఉద్భోదిస్తున్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది కార్యకర్తలు 65 లక్షల మంది చంద్రబాబులతో సమానం. ఎన్టీఆర్ ఆత్మగౌరవంతో ముందుకెళ్తే నేను ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నా. తెదేపా సైన్యం ఎన్నికల్లో పెను తుపాను సృష్టించి వైకాపాను చిత్తుగా ఓడించాలంటూ స్ఫూర్తినింపుతున్నారు.