పొత్తుల్లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీకి మూడు లోక్సభ, 21 శాసనసభా స్థానాలను కేటాయించినట్టు జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, బాపట్ల పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి కేటాయించినట్టు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఏస్పీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యులు వీర్సింగ్, ఆ పార్టీ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్కళ్యాణ్ మాట్లాడుతూ... “బీఎస్పీకి 3 లోక్ సభ స్థానాలు, 21 శాసన సభ స్థానాలు కేటాయించాం. బీఎస్పీతో కలసి ప్రయాణం చేయడం వ్యక్తిగతంగా చాలా ఆనందాన్నిచ్చింది. గతంలో నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఎస్పీ అధ్యక్షునిగా పని చేయమని అడిగారు. అయితే ఆనాటి రాజకీయ ప్రస్థానం వల్ల అది ముందుకి వెళ్లలేదు.
ఇప్పుడు పొత్తుల కారణంగా ఆ అవకాశం వచ్చింది. సోదరి మాయావతి లాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని దేశానికి ప్రధానిగా చూడాలన్నది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. అలా ఆకాంక్షించే వారిలో నేను కూడా ఒకడిని.`` అని పవన్ వెల్లడించారు.