ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సభల బాధ్యతలను చూస్తున్న కేటీఆర్ ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పెద్దసైజు ప్రాంతీయ పార్టీలేనన్న కేటీఆర్.. దేశాన్ని ఇన్నేళ్లు పాలించిన ఈ రెండు పార్టీలు 70 సంవత్సరాల్లో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, అది తెలంగాణ నుంచే మొదలుకావాలని ఆకాంక్షించారు. లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను సాధించి దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా ఏపీ రాజకీయం గురించి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి గెలుపొందడం గురించి కేటీఆర్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ``చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా పనిచేసిన.. నాకు ఓటు వేయండి అని అధికార పార్టీగా అడగాలి. ఇంకా గెలిపిస్తే ఫలానా పనిచేస్తాం అని చెప్పగలగాలి. తెలంగాణలో టీఆర్ఎస్ అదే పనిచేసింది. మేం ఏం పనిచేశామో చెప్పాం..మళ్లీ గెలిపిస్తే ఈ పనులు చేస్తామని ఓటు అడిగాం. కానీ చంద్రబాబు...నెగెటివ్ ధోరణితో బట్టకాల్చి మీద వేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఓట్లు పొందాలని నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే.. ఆంధ్ర ప్రజలు బాగుండాలి.. తెలంగాణ ప్రజలు బాగుండాలనేది మా విధానం. గత ఐదేళ్లలో ఏపీ ప్రయోజనాల విషయంలో ఏనాడూ వారికి ఆటంకం కల్పించలేదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమం చేయబోం.`` అని స్పష్టం చేశారు.
ఏపీ ప్రయోజనాలపై వ్యతిరేక భావం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ``తెలంగాణలో చంద్రబాబు ఇక్కడి సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసినా చైతన్యవంతమైన సీమాంధ్ర ప్రజలు తిరస్కరించారు. ఏపీ ప్రజలు కూడా నెగెటివ్ పాలిటిక్స్ను తిప్పికొడుతారని నమ్ముతున్నా. తమకు ఏ నాయకత్వం అయితే మేలు జరుగుతుంది, ఎవరి వల్ల ఏపీ ముందుకు పోతుంది అనేది ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్కు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టాల్సిన అవసరం, పరిస్థితి లేదు. `` అని స్పష్టం చేశారు.