తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేల చేరికకు బ్రేక్ పడటం లేదు. కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఎనిమిది మంది టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. మరికొందరు అదేదారిలో ఉన్నట్టు సమాచారం. ఆదివారం కాంగ్రెస్కు చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమ య్యారు. అధికారపార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు క్యూ కడుతుండటంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 100కు చేరుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం ఇండిపెండెంట్లుగా గెలిచిన కోరుకంటి చందర్, రాములునాయక్ టీఆర్ఎస్లో చేరారు. టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్, సబితాఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, తాజాగా వనమా వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరనున్నట్లుగా ప్రకటించారు. వీరితోపాటు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కలిపి అధికార టీఆర్ఎస్ బలం 100కు చేరినట్టయింది. త్వరలో మరికొందరు చేరేందుకు సన్నాహాలు చేసుకుటుండటంతో ఈ సంఖ్య మరింత పెరుగనుంది.
మరోవైపు, కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు క్యూ కడుతున్నారని, ఇక అసెంబ్లీలో కాంగ్రెస్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క మాత్రమే మిగలనున్నారా? అని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. 100కు చేరుకున్న టీఆర్ఎస్ బలం మరింత పెరగనుందని మరికొందరు జోస్యం చెపుతున్నారు.