చంద్రబాబునాయుడు, పవన్
కల్యాణ్ మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారం నడుస్తోందని బాగా ప్రచారం జరుగుతోంది. టిడిపి
పోటీ చేస్తున్న ప్రధాన నియోజకవర్గాల్లో జనసేన పోటీ నుండి తప్పుకోవటమే ఇందుకు
నిదర్శనంగా విమర్శలు మొదలైపోయాయి. మొదటి నుండి కూడా చంద్రబాబు జేబులో మనిషిగానే
పవన్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ ఆరోపణలు తెలిసినా వాటిని
పోగొట్టుకునేందుకు పవన్ ఎప్పుడూ ప్రయత్నించలేదనుకోండి అది వేరే సంగతి. ఎన్నికల
తేదీ దగ్గరకు వచ్చేస్తోంది కదా. అందుకు ఆ విషయం స్పష్టంగా బయపడుతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, రాబోయే ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు, బిఎస్పీ పొత్తులతో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగానే పోటీ చేసేందుకు కొన్ని నియోజకవర్గాలను జనసేన తానే అట్టిపెట్టుకుందట. మరికొన్ని టిడిపి కీలక నియోజకవర్గాల్లో మిత్రపక్షాల తరపున డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టాలని అడుగుతోందట. మరి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా టిడిపి, జనసేన మధ్య క్విడ్ ప్రో కో జరుగుతోందనే ఆరోపణలు రాక ఇంకేమొస్తాయ్ ?
రాబోయే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా జరుగుతాయనుకుంటున్న నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ వైసిపి తరపున ఆళ్ళ రామకృష్ణారెడ్డి, టిడిపి తరపున చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఏ ఉద్దేశ్యంతో లోకేష్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారో తెలీదు. అయితే, యువరాజు గెలుపుకు తీవ్రంగా శ్రమించాల్సిందే. ఇటువంటి నియోకవర్గాన్ని పొత్తుల్లో సిపిఐకి కేటాయించారు.
నిజానికి మంగళగిరిలో చేనేత పరిశ్రమకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని పవన్ ప్రకటించుకున్నారు. కాబట్టి పవన్ ఇక్కడి నుండి పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే, నామినేషన్ల తేదీ దగ్గర పడిన తర్వాత పవన్ మాత్రం ఉత్తరాంధ్రకు వెళ్ళిపోయారు. లోకేష్ కోసమే ఈ సీటును జనసేన త్యాగం చేసిందట. ఇక విజయవాడ సెంట్రల్ సీటును బోండా ఉమ కోసం సిపిఎంకు ఇచ్చేసిందిట.
అదే సమయంలో చంద్రబాబు నుండి కూడా పవన్ విషయంలో సానుకూలత కనిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు టికెట్లను కేటాయించలేదు. ఎందుకంటే, భీమిలీలో జేడి లక్ష్మీనారాయణ, గాజువాకలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. అయితే ముందుజాగ్రత్తగా పెందుర్తిని కూడా రిజర్వ్ లో ఉంచారు. గాజువాక నియోజకవర్గానికి టిడిపి ఎంఎల్ఏనే ఉన్నారు. పెందుర్తిలో వరుసగా ఐదుసార్లుగా బండారు సత్యనారాయణ గెలుస్తున్నా కూడా పెండింగ్ లో ఉంచటం విచిత్రంగా ఉంది. అంటే పై రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏ స్ధాయిలో నడుస్తోందో అర్ధమైపోతోంది కదా ?