రంపచోడవరం నియోజకవర్గంలో ఈ సారి ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీతో పాటు సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, జనసేన, వైసీపీ రెబల్స్, పలువురు స్వతంత్రులు ఇలా మిక్కిలి సంఖ్యలో అభ్యర్థులు పోటీకి సై అంటుడటం ఆసక్తి గొలుపుతోంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత పోలవరం మంపు మండలాల్లో భాగంగా నాలుగు తెలంగాణ పరిధిలోని నాలుగు మండలాలను రంపచోడవరం నియోజకవర్గంలో విలీనం చేశారు. దీంతో అంతకు ముందు ఉన్న ఏడు మండలాలకు తోడు నాలుగు మండలాలు జత కావడంతో మొత్తం 11మండలాలతో రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం అవతరిచింది. ఇక ఈ సారి ఇక్కడి నుంచి పోటీ చేసే అధికార, ప్రతిపక్ష, విపక్షాల అభ్యర్థులు స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలు ఏకరువు పెడుతూనే ప్రచారంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే జనసేన మినహా అన్ని పక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించాయి. రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గంగా అవతరించిన ఈ సీటుపై ప్రధాన పార్టీలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన వైసీపీ ఎలాగైనా ఈ సారి విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉంది. అందుకే అభ్యర్థిని కూడా మార్చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి, సీపీఎం అభ్యర్థి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు బరిలోకి దిగుతున్నారు. టీడీపీ తరపున రాజేశ్వరి రెండోసారి విజయం సాధించాలని చూస్తున్నారు. సీపీఎంకు చెందిన సున్నం రాజయ్యకు ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం వుంది. వైసీపీకి చెందిన నాగులపల్లి ధనలక్ష్మి కొత్తగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు.
అయితే ప్రధానంగా పోటీ టీడీపీ-వైసీపీ, సీపీఎం అభ్యర్థుల మధ్య ఉండనుందని తెలుస్తోంది.జనసేన పార్టీ సీపీఎం అభ్యర్థికి మద్దతివ్వనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గత మూడు పర్యాయాలుగా భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసిన సున్నం రాజయ్య కూడా బలమైన అభ్యర్థిగా మారన్నాడు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని ముందు నుంచే భావించిన ఆయన 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు అందుకే గతంలో ఓ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్తో రంపచోడవరంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది ఆ పార్టీ. ఇప్పుడు ప్రధాన పార్టీలకు ధీటుగా ఆ పార్టీ అక్కడ సిద్ధమవుతుండటం కొంత ఆసక్తి గొలుపుతోంది. మరి తెలంగాణలో భద్రాచలం నుంచి వరుస విజయాలు సాధించిన రాజయ్య ఇక్కడ గెలుస్తాడా ? ఏపీ అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాబల్యం ఉంటుందా ? అన్నది చూడాలి.