ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీశధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచార పర్వం ఆసక్తికరంగానే కాదు..చర్చనీయాంశంగా కూడా మారుతోంది. ఇప్పటికే ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై విపక్షాలే కాకుండా సొంత పార్టీలోనూ ఆలోచనలో పడేస్తోంది. పార్టీ నేతలను తన సైన్యం అని పేర్కొంటున్న చంద్రబాబు డ్వాక్రా మహిళలను సైతం పచ్చాపార్టీ కార్యకర్తలుగా పేర్కొనడం చూస్తుంటే...బాబు మాటలు హద్దులు దాటుతున్నాయనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు.
తాజాగా, ఒంగోలులో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగాఅనేక అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ఆడబిడ్డల పసుపు కుంకుమలు తెంచి వేస్తుంటే.. నేను ఆడబిడ్డలకు పసుపు కుంకుమ అందించానని పేర్కొన్నారు. పరిటాల రవిని పార్టీ కార్యాలయం ముందు చంపి కేసు లేకుండా చేశారని ఆరోపిస్తూ హత్యారాజకీయాలు నేను నమ్మను అని చెప్పుకొచ్చారు. నా దగ్గర పని చేసిన కేసీఆర్ కే టెక్కుంటే... నాకెంత టెక్కుంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రులు.. రాక్షసులు, పేడ బిర్యానీ అంటూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
తనకు సమర్ధవంతమైన సైన్యం ఉందని అలెగ్జాండర్ చెప్పేవారని.. టీడీపీకి కూడా 65లక్షల పసుపు సైన్యం ఉందన్నారు. డ్వాక్రా సంఘాల్లో కోటి మంది చెల్లెమ్మలు తనకు ఉన్నారని.. ఏ నాయకుడికీ ఇంతమంది చెల్లెమ్మలు ఉండరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ శాశ్వతంగా లోటస్పాండ్లో ఉంటేనే మంచిదని బాబు వ్యాఖ్యానించారు. నమ్మక ద్రోహులను ఒంగోలు గిత్తల్లా కుమ్మేయాలి అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.