ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రంలో తన పదవికి రాజీనామా చేసి ఇటీవల ఆంధ్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర రైతులతో సమావేశమయ్యి త్వరలోనే ఓ పొలిటికల్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్న సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా జనసేన పార్టీలో చేరడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి.
ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కేసుల్లో ఎల్లో మీడియాకు అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ సహకరిస్తున్నారంటూ చంద్రబాబు కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో అనేక కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ లోకి వెళ్ళడాని ఉద్దేశించి వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
విజయసాయిరెడ్డి ఏమన్నారంటే...ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా? అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.