రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీకి పెద్ద ఊరట దొరికింది.స్వీడన్ టెలికాం కంపెనీ ఎరిక్సన్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడిపోయింది. ఆయన జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. ఎరిక్సన్కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్కామ్ను ఆదేశించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని హెచ్చరించిన సంగతీ విదితమే. అయితే ఇప్పటికే రూ.118 కోట్లు చెల్లించింది. ఎరిక్సన్ బకాయిలు చెల్లించడానికి(మార్చి 19,2019) ఆర్కామ్కు ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉండగా.. తాజాగా ఆ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆర్కామ్ పూర్తిగా చెల్లించింది.
ఈ విషయాన్ని ఎరిక్సన్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. రూ.462కోట్ల బకాయిలను రిలయన్స్ సంస్థ తమ ఖాతాలో జమచేసినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు. స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్కు వ్యాపార సేవల కింద అనిల్ అంబానీ సొమ్ము బకాయి పడ్డారు. నిజానికి అనిల్ అంబానీ బకాయి రూ.1600 కోట్లు కాగా, కోర్టు మధ్యవర్తిత్వంతో ఎరిక్సన్ ఆ మొత్తాన్ని రూ.550 కోట్లకు తగ్గించింది. ఆ సొమ్ము చెల్లించాల్సిన గడువు గత ఏడాది సెప్టెంబర్ 30న దాటిపోవడంతో ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదివరకే ఒప్పుకుని చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ.550 కోట్ల బకాయీ విషయంలో చట్టాన్ని దుర్వినియోగం చేశారని ఎరిక్సన్ ఆరోపించింది.
ఈ దేశ చట్టాలంటే గౌరవం లేదు.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఎరిక్సన్ తన పిటిషన్లో విమర్శించింది. వారిపై కోర్టుధిక్కార నేరం కింద చర్యలు చేపట్టాలని, వారు దేశం వదిలి పారిపోకుండా నిరోధించాలని కోరింది. అయితే, గత ఏడాది సెప్టెంబర్లో దాఖలు చేసిన పిటిషన్ గడువు తీరిపోవడంతో అక్టోబర్లో ఎరిక్సన్ అనిల్పై కోర్టుధిక్కార పిటిషన్ వేసింది. దాంతో కోర్టు ఆయనకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. కానీ అది కూడా ఉల్లంఘించారని ఎరిక్సన్ తన పిటిషన్లో పేర్కొంది. ఇలా కోర్టుల జోక్యంతో సాగిన చెల్లింపుల ప్రక్రియ తాజాగా ఈ రూపంలో శుభం కార్డు పడింది.