ఏపీలో జరుగుతున్న హోరాహోరీ పోరులో అందరి చూపు అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైసీపీలపై పడిన సంగతి తెలిసిందే. పీఠం కైవసం చేసుకునేందుకు వైసీపీ సన్నద్ధమవుతుంటే...అధికారం కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ చెమటోడుస్తుంది. అయితే, మరో ప్రధాన పార్టీగా జనసేన రంగంలోకి వచ్చింది. అధికార ప్రతిపక్షాల విజయాలను ఈ పార్టీ ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అధికార తెలుగుదేశం పార్టీతో రహస్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...వైసీపీ ఓటమికి వ్యూహాత్మకంగా పావులు కదువుతున్నారని అంటున్నారు. తాజాగా, ఆయన తీసుకున్న నిర్ణయం ఈ ఎత్తుగడలో భాగమని చెప్తున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రంపై మరో పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లోని లక్నో వెళ్లిన పవన్.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు.
ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయ వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా మరుసటి రోజు జనసేన, బహుజన సమాజ్ పార్టీ సీట్ల చర్చలు సఫలమయ్యాయి. అయితే, ఈ పొత్తు ఎఫెక్ట్ నేరుగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై పడనుందని విశ్లేషిస్తున్నారు.
జనసేన పార్టీ, బీఎస్పీ పొత్తు ఫలితంగా ప్రధానంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు దెబ్బపడనుందని అంటున్నారు. జగన్కు అండగా ఉన్న దళిత సామాజికవర్గం తాజా పొత్తుతో వైసీపీ కంటే జనసేన-బీఎస్పీ కూటమి వైపు మొగ్గు చూపుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా, ఎన్నికల్లో జగన్కు నష్టం జరగడం ఖాయమనేది కొందరి లెక్క.