తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఐదేళ్ల పాటు ఈ వేదికను నడిపిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి... కొద్దికాలం క్రితం చాపచుట్టేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆర్పీఎస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే, బైరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు మరే పార్టీలోకి వెళ్లలేని స్థితిలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆర్పీఎస్ను స్థాపించిన బైరెడ్డి అనంతరం రాయలసీమ ఉద్యమం పూర్తిగా ముందుకు వెళ్లని నేపథ్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ చేరికకు ముందే టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించి పునరావసం పొందడానికి సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే, ఏమైందో ఏమో కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. డీసీసీ పదవి విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో బైరెడ్డికి విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గత ఏడాది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన బైరెడ్డి ఏడాదికే సొంత దారి చూసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉండగా, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు చేయడంతో బైరెడ్డి ఏ పార్టీలో చేరతారనే చర్చ తెరమీదకు వచ్చింది. అయితే, సొంత పార్టీ అయిన తెలుగుదేశం గూటికే బైరెడ్డి రాజశేఖర్రెడ్డికి రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇటీవలే ఆయన ఇందుకు రీతిలో చర్చలు పూర్తి చేసుకున్నారు. త్వరలో బైరెడ్డి చేరిక ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.