కర్నాటకలో కుమార స్వామి అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు రసవత్తరంగానే మారుతున్నాయి. జేడీఎస్ – కాంగ్రెస్ కూటమికి పాలన నిప్పులపై నడకలా సాగుతోంది. బీజేపీ రూపంలో ఎప్పుడు గాలి వీస్తుందో.. దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కూటమికి మరో చిక్కు వచ్చి పడింది సుమలత రూపంలో..! భర్త అంబరీష్ హఠాన్మరణంతో ఖాలీ అయిన మండ్య స్థానం నుంతి తాను స్వతంత్రంగా బరిలోగి దిగాలనుకోవడమే ఇందుకు కారణం.
కర్ణాటక రాజకీయాల్లో మాండ్య ఎంపీ సీటు సెగలు పుట్టిస్తోంది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. తన భర్త అంబరీష్ ఆశయసాధన కోసం రాజకీయాల్లోకి వచ్చి మాండ్య నుంచి పోటీ చేయాలని సుమలత భావించారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు దాదాపు సీటు ఖరారు చేసింది. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. తెర వెనుక రాజకీయాలు కారణంగా సుమలతకు సీటు దక్కలేదు. అక్కడ నుంచి సీఎం తనయుడిని బరిలోకి దించుతున్నారు. మాండ్య నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని సుమలత నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో కర్ణాటక రాజకీయలు హాట్ హాట్ గా మారిపోయాయి.
తన భర్తకు గట్టి పట్టున్న మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి సుమలత పోటీ చేయాలని కోరకుంటున్నారు. ఆమె ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడో స్పష్టంగా తెలియజేశారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఆమె ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిది. ఆమెకే సీటు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మాండ్య నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ ను బరిలోకి దించాలని దేవగౌడ కుటుంబం నిర్ణయించుకుంది. పొత్తులో భాగంగా ఈసీటు తమకే కావాలని పట్టుబట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాండ్యను జేడీఎస్ కి వదిలిపెట్టింది.
సుమలతకు సీటు దక్కకుండా.. ఆ సీటు జేడీఎస్ కు వదిలిపెట్టే చేయడం మాజీ సీఎం సిద్ధరామయ్య స్కెచ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో సిద్ధరామయ్యను అంబరీష్ గట్టిగా వ్యతిరేకించారు. ఎంతగా అంటే.. చివరికి అంబరీష్ ను తన కేబినేట్ నుంచి కూడా తొలగించారు. ఇప్పుడు సుమలత యాక్టివ్ అయితే.. పార్టీలో తనకు ఇబ్బందులు తప్పవనుకున్న సిద్ధరామయ్య ఆమెకు అదిలోనే చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు సీటు దక్కుండా చేశారు. ఆ క్రమంలోనే మాండ్య సీటు పొత్తులో భాగంగా జేడీఎస్ సులభంగానే దక్కించుకుంది.
మాండ్య సీటు అడిగిన సుమలత మీద దేవగౌడ కుటుంబ సభ్యులు తీవ్రమైన కామెంట్లు చేశారు. చివరకు సీఎం కుమారస్వామి క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. కుమారస్వామి తనయుడు అక్కడ నుంచి నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ సమయంలో సుమలత బాంబు పేల్చారు. మాండ్య నుంచి పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్ గా దిగుతానని ప్రకటించారు.
బీజేపీ వెంటనే అలర్ట్ అయింది. సుమలతకే తమ మద్దతు అని ప్రకటించింది. మాండ్యలో అంబరీష్ కి గట్టి పట్టుంది. దీనికితోడు బీజేపీకి అక్కడ మంచి ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి.. సుమలత అక్కడ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాండ్య జిల్లాలో కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కాదని సుమలతకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ లో భారీ చీలిక ఖాయంగా కనిస్తోంది. దీనికితోడు భర్త చనిపోయాడన్న సానూభూతి కూడా ఉంది. పైగా.. కన్నడ సినీ ఇండస్ట్రీ కూడా సుమలతకు అండగా నిలుస్తోంది.. ఇవన్నీ కలిసొస్తే.. అక్కడ సుమలత విజయం నల్లేరు మీద నడకే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.