ఏపీ ప్రజలు ఇంకొక్క 20 రోజులు ఓపికపడితే సమస్యల పరిష్కారం అవుతాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి గ్రామంలో..ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ``14 నెలలు దాదాపు 3648 కిలోమీటర్లు దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో మీతోనే నడిచాను. మీ కష్టాలు విన్నాను. మీ బాధలు అర్థం చేసుకున్నాను. ఆ పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాను.
13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏ గ్రామం తీసుకున్నా కూడా చంద్రబాబు చేసిన పథకాలు ఏమిటీ? స్కీములు ఏంటి అని చూస్తే..మనకు కనిపించేది ఏంటో తెలుసా? చంద్రబాబు అధికారంలోకి రాగానే రేషన్కార్డులు తీసేశారు. పింఛన్లు తీసేశారు. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలను పక్కన పెట్టి జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. ఈ మాఫియా చేసిందెంటో తెలుసా? గ్రామంలోని మట్టి నుంచి ప్రతి ఒక్కటి దోచేశారు. ప్రతి పనికి లంచం తీసుకున్నారు. జన్మభూమి కమిటీలు తీసుకున్న లంచాలు గురించి ప్రతి గ్రామంలో చెప్పారు. నేను విన్నాను. మరుగుదొడ్డికి లంచం రూ.1800 లంచం, చంద్రన్న బీమాకు లంచం, బర్త్ సర్టిఫికెట్కు, డేత్ సర్టిఫికెట్కు లంచం, పింఛన్ తీసుకోవాలన్నా లంచం..గ్రామ గ్రామానా లంచాల పాలన చూశాను.
ప్రజల ఇ బ్బందులు విన్నాను..చూశాను. వారికి లంచాలు లేని సంక్షేమ పాలన అందించేందుకు నేనున్నానని మాటిస్తున్నాను. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు`` అని స్పష్టం చేశారు. ``45 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్క వద్దకు వెళ్లండి..అక్క చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు..అన్న సీఎం అయ్యాక వైఎస్ఆర్ చేయూత పథకం తెస్తారు. నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి.
20 రోజులు ఓపిక పడితే అన్న సీఎం అవుతారు. ప్రతి ఏటా మే మాసంలో రూ.12500 ప్రతి రైతుకు ఇస్తారని చెప్పండి.
అవ్వా తాతల వద్దకు వెళ్లండి. మూడు నెలలక్రితం పింఛన్ ఎంత వచ్చేదని అడగండి. వెయ్యి రూపాయలు వస్తుందని చెబుతారు. ఎన్నికలు రాకపోయి ఉంటే..జగన్ పింఛన్ రూ.2 వేలు ఇస్తామనకుంటే చంద్రబాబు రూ.2 వేలు ఇచ్చేవాడా? . చంద్రబాబు మోసాలకు మోసపోవద్దు..అన్న సీఎం అయ్యాక పింఛన్ రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తారని చెప్పండి. నవరత్నాల్లో ప్రతి అంశం ప్రతి ఇంటికి చేర్చండి. `` అని జగన్ వెల్లడించారు.
``చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని డ్వాక్రా సంఘాల మహిళలకు చెప్పండి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంతైతే అప్పులు ఉంటాయో వాటన్నింటిని నేరుగా నాలుగు దఫాలుగా మీ చేతుల్లో పెడతారని చెప్పండి. బ్యాంకుల్లోకి గర్వంగా వెళ్లి రుణాలు తెచ్చుకుందామని చెప్పండి.`` అని జగన్ కోరారు.