రాహుల్ గాంధి చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారోగాని - ఆ అక్రమ సంభంధం షాక్ కొట్టి తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోతుంటే - కాంగ్రెస్ క్రమంగా అంతరించిపోతుందా? అనే అనుమానం తెలంగాణా ప్రజల్లో షాకిస్తుంది. శాసనసభలో ప్రతిపక్ష స్థానం సైతం కాంగ్రెస్ కోల్పోయినట్లే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ను వీడగా మరి కొంత మంది అదే బాటలో ఉన్నారు.
తాజాగా మహబూబ్నగర్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ను వీడే యోచన లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు. రామ్ మాధవ్ తో దాదాపు 45 నిమిషా ల పాటు చర్చించారు.
అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా ఆమె భవిష్యత్పై షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా హామీతో ఆమె ఢిల్లీ పయనమయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డీకే అరుణ బీజేపీ తరపున మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో డీకే అరుణ గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
బుధవారం జాతీయ అధ్యక్షుడు సమక్షంలో అరుణ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమె మహబూబ్ నగర్ లోక్-సభ నుంచి ఎన్ని కల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీకే ఆరుణతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఇక ఇప్పటికే చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి మంగళవారం అధికారికంగా టీఆర్ఎస్ లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. ఇలా వరుస వలసలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది.