గుడివాడ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అతికొద్ది హాట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ నేత, మాస్ ఇమేజ్ కలిగి ఉన్న కొడాలి నాని ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. పార్టీ ఏదైనా గెలుపు నానిదే అనేది ఇప్పటికే సుస్పష్టం. అయితే, తాజాగా ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. పచ్చ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన నేతను ఓడిస్తాడని తొలిసారిగా బరిలో దిగుతున్న దేవినేని అవినాష్పై గంపెడాశలు పెట్టుకుంది. అయితే, దీనికి తోడుగా కోట్లాది రూపాయలు కుమ్మరించే ఎత్తుగడను వేసిందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఓటుకు రూ.5000 ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుడివాడ నియోజకవర్గం కొడాలి నానికి పెట్టని కోటగా మారిందనేది తెలిసిన సంగతే. మాస్ లీడర్ అనే గుర్తింపు పొందిన నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, వైసీపీలో చేరిన తర్వాత కూడా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీ ఏదైనా గెలుపును సొంతం చేసుకుంటున్న మాస్ లీడర్పై నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన యువనేత అవినాష్ను టీడీపీ బరిలో దింపింది. ఇక టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే అవినాష్పై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. 2019 ఎన్నికల్లో కృష్ణాజిల్లా వైసీపీలో ఉన్న భల్లాల దేవుడు లాంటి వ్యక్తిపై అవినాష్ పోటీకి దిగుతాడని ప్రకటించారు.! విజయపథంలో సాగుతున్న కొడాలి నానిని అవినాష్ ఓడించగలడా? టీడీపీ నేతలు చెప్తున్నట్లు బాహుబలిగా నిలుస్తాడా? అనే సందేహాలు సహజంగానే ఉన్నప్పటికీ, గెలుపుకోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోందనే టాక్ వినిపిస్తోంది.
గుడివాడ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనదైన నేపథ్యంలో ఇక్కడ ఒక్కో ఓటుకు రూ.5000 ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చూస్తున్న టీడీపీ పెద్దలు ఈ మేరకు ఆర్థిక వనరులను సమీకరించడం మొదలుపెట్టారని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, యువనేతకు ఓటు వేయాలని...ఇలా రొటీన్ ప్రచారానికి తోడుగా వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నాని ఓడించాలనే లక్ష్యంతో బాబు వేస్తున్న ఎత్తుగడ ఫలిస్తుందా? కొడాలి నానిని ఓటమి పలకరిస్తుందా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.