ఉత్తరాంధ్రాలో నోరున్న మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడుకు పేరుంది. ఆయన అన్న దివంగత ఎర్రన్న్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అచ్చెన్నాయుడు కొనసాగిస్తున్నారు. అన్న డిల్లీ రాజకీయాల్లో ఉంటే తమ్ముడు అచ్చెన్న శ్రీకాకుళం రాజకీయాలను చక్కబెడుతుండేవారు. ఎర్రన్నాయుడు 2012లో అకాలమరణం తరువాత అచ్చెన్నాయుడు జిల్లా టీడీపీ రాజకీయాల్లో పెద్ద దిక్కుగా మారిపోయారు.
అచ్చెన్నాయుడు మరో మారు టెక్కలి నుంచి బరిలో ఉంటున్నారు. ఆయన్ని తొలిసారి మంత్రిని చేసిన ఈ సీటుపై పట్టు బాగానే బిగించారు. ఆయన 2014 ఎన్నికల్లో దాదాపు ఎనిమిదిన్నర వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన ప్రత్యర్ధి అపుడు దువ్వాడ స్రీనివాస్. తాజా ఎన్నికల్లో అచ్చెన్నతో వైసీపీ నుంచి పేడాడ తిలక్ తలపడుతున్నారు. దువ్వాడ, పేడాడ వర్గాలు ఇపుడు కలసి పనిచేస్తున్నాయి.
దానికి తోడు జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న కిల్లి క్రుపారాణి వైసీపీలో చేరిపోయారు. ఆమె బలం కూడా తోడు కావడంతో టెక్కలిలో అచ్చెన్నకు ఈ ఎన్నికలు కత్తి మీద సాముగానే చెప్పాలి.
అచ్చెన్నను ఎలాగైనా ఓడించాలని జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారు. అందుకోసం ఆయన చాల వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దువ్వాడకి చివరి నిముషంలో శ్రీకాకుళం ఎంపీ సీటు ఇవ్వడం ద్వారాఅక్కడ వర్గ పోరు లేకుండా చూశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వైసీపీకి బలం బాగా పెరిగింది. అంతే కాదు. పార్టీలోనూ ఐక్యత ఎక్కువైంది. దాంతో ఈసారి అనూహ్య ఫలితాలు వస్తాయని, జిల్లకు చెందిన ఇద్దరు మంత్రులు అచ్చెన్న, కళా వెంకటరావు ఓడిపోతారని వైసీపీ నేతలు అంటున్నారు.