జనసేన తన ప్రచారాస్త్రంతో టీడీపీ, వైసీపీలకు ముచ్చెమటలను పట్టిస్తోంది. రెండు ప్రధాన పార్టీలుగా భావిస్తున్న టీడీపీ, వైసీపీల కన్నా జనసేన సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్గా ఉంది. తమకున్న పరిమిత ఆర్థిక వనరులతో పరోక్ష ప్రచారంలో ఎంతో మెరుగ్గా దూసుకెళ్తోంది. అదే సమయంలో సంప్రదాయ ప్రచార మాధ్యమాలకే రెండు ప్రధాన పార్టీలు పరిమితమవుతుండటం గమనార్హం. వైవిధ్యమైన పోస్టింగ్లతో జనసేన సోషల్ వింగ్ పార్టీ ఎజెండాను, పవన్ నాయకత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండగా వైసీపీ, టీడీపీలు మాత్రం బాగా వెనుకంజలో ఉండిపోతున్నాయి. వాస్తవానికి నేటి సమాజంలో సోషల్ మీడియా అనేది ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉండటంతో సోషల్ మీడియాలో ఆక్టివ్గా ఉంటున్నారు.
తమ భావాన్ని వ్యక్తం పరచడంతో పాటు ఒకేరకమైన భావజాలంతో ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటున్నది తెలిసిందే. అంతేకాక పేపర్ చదివి..టీవీ చూసేంత తీరిక నేటి ఆధునిక సమాజంలో చాలా తక్కువ. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకున్న జనసేన పార్టీ చాలా రోజుల క్రితమే సోషల్ వింగ్ను ఏర్పాటు చేసింది. వాస్తవానికి మొదటి నుంచి పవన్ కోసం కొంతమంది ఐటీ సెక్టర్కు చెందిన ఆయన అభిమానులు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. దాదాపు ఫ్రీగా ప్రచారం సోషల్ మీడియాతో జనసేనకు లభిస్తోందని చెప్పాలి. జనసేన పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూనే..విపక్షాల ఆరోపణలను, వైఫల్యాలకు కౌంటర్ ఇస్తూ వస్తోంది. అదే సమయంలో జనాభిప్రాయాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకుంటోది.
జనసేన పార్టీకి సంబంధించిన పాటలు గానీ, సభలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంటుండటం గమనార్హం. వాస్తవానికి సినిమా కథానాయకుడిగా పవన్కు సహజంగానే యూత్లో, భిన్న వయస్కులు, మహిళల్లో మంచి ఇమేజ్ ఉంది. ఈ వర్గం ప్రజలకు దగ్గర కావడానికి, చేజారిపోకుండా ఉండటానికి పవన్ టీం సోషల్ ప్రచారాస్త్రాన్ని ఎక్కుపెట్టి విజయం సాధించిదనే చెప్పాలి. ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీలోకి చేరిన సమయంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు కూడా ఆలోచనలో పడ్డారు. ప్రధాన పత్రికల్లోగాని, ఎలాక్ట్రానిక్ మీడియాలో గాని పెద్దగా కవరేజ్ కనబడకపోయినా సోషల్ వింగ్ మాత్రం పవన్ పార్టీని ఆదుకుందనే చెప్పాలి. జనసేన సోషల్ మీడియా వింగ్ దెబ్బకు ఇటు టీడీపీ.. అటు వైసీపీలు అబ్చో అంటున్నాయి.