కీలకమైన ఎన్నికల తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి పార్టీకి తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేసిన ఎస్పీవై రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన జనసేన పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో నంద్యాల ఎంపీ టికెట్ తనకు ఖాయమని ఎస్పీవై భావించారు. అయితే, ఆ టికెట్ మాండ్ర శివానంద్రెడ్డికి కేటాయించి చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు. దీంతో టీడీపీ తనను మోసం చేసిందని ఆవేదన చెందిన ఆయన నంద్యాల నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో జనసేన నేతలు సంప్రదించినట్లు సమాచారం. తమ పార్టీలో చేరితే నంద్యాల టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
విజయవాడలో ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమార్తెతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను జనసేన కార్యాలయంలో ఎస్పీవై రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. ఎస్పీవై రెడ్డికి ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం నంద్యాల టికెట్ ఖరారు కానుందని సమాచారం.