బాబు, జగన్, పవన్...ఎన్నికల సమయంలో ఒకే మాటపై ఉన్నారే ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే కొందరు ముందుకు కదలరు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే, కీలకమైన ఎన్నికల సమయంలో, ప్రచారం దగ్గర నుంచి నామినేషన్ దాఖలు వరకు అన్నింటికీ ముహూర్తాలు చూసుకునే చేస్తుంటారు. ఎన్నికల సమయంలో జ్యోతిష్యులకు ఉండే క్రేజే వేరు. వారు చెప్పిందే వేదంగా అమలు నేతలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు ఏపీలోని ముఖ్యనేతలు.
ఏపీలో హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయా పార్టీల రథసారథులు ఓ వైపు అభ్యర్థుల ఖరారు మరోవైపు ఎన్నికల వ్యూహాలు, ప్రచార పర్వంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ అవకాశం కల్పించడం ఆయా పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.అయితే, ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం వరకూ అందరు నేతలు ముహూర్తాలను తెగ ఫాలో అవుతున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఉన్నారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరూ మార్చి 22 విదియ, హస్తా నక్షత్రం కావడంతో .. ఆ రోజు నామినేషన్ దాఖలు చేయాలని చూస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ 21, 22 తేదీల్లో రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఎలా ఉన్నా....ఈ ముగ్గురు నేతలు నామినేషన్ విషయంలో మాత్రం ఒకే అభిప్రాయంతో ఉన్నారని పలువురు చర్చించుకుంటున్నారు.