ఉత్తరప్రదేశ్ - కంట్రీ విత్ ఇన్ ఏ కంట్రీ అంటే భారత దేశపు సమగ్ర స్వరూపం అన్నమాట. అందుకే దేశం ఒక ఎత్తు యుపి ఒక్కటీ ఒక ఎత్తు అంటుంటారు. ప్రతీ రాష్ట్రంలోనూ కుల ప్రభావం ఉండనే ఉంది. అయినా యూపీలో ఉన్నంత కూలకుంపట్లు ఒక కులగూరగంపలా ఏమాత్రం అర్ధమవ్వని స్థితి దేశంలో వేరెక్కడా కనబడదు.
రాష్ట్రంలోని మొత్తం 80 లోక్ సభ సీట్లకు గాను బీజేపీ గత 2014 లో ఏకంగా 71 స్థానాలు గెలవగలిగింది. ఆనాడు అదంతా నేటి ప్రధాని నరేంద్ర మోదీ మేజిక్, అమిత్ షా సోషల్ ఇంజినీరింగ్ ప్రభావం అంటారు. అదే బీజేపీ ఢిల్లీ గద్దెను దక్కేలా చేశాయి.
ముస్లిం మత ఓట్ల తో పాటు ప్రాధాన్య కులాలైన, యాదవ, దళిత, ఓబీసీ ఓట్లన్నీ గంపగుత్తగా పడిపోవటం తో బిజేపికి విజయం సాధ్యమయ్యింది. ఆ వర్గాలకు ఏళ్ల తరబడి ప్రాతినిథ్యం వహించిన సమాజ్ వాదీ (ఎస్పి), బహుజన్ సమాజ్ వాదీ పార్టీల (బిఎస్పి) ఓట్లు చీలడం వారికి కలిసొచ్చింది. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఎస్పీ-బీఎస్పీలు ఒకదానితో ఒకటి చేతులు కలపడంతో పరిస్థితి తారుమారయ్యే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు.
మొత్తం 80 సీట్లకు గాను 47 సీట్లలో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని బిజేపి వ్యతిరేక్ష పక్షాల వాదన. ఈ 47 చోట్ల ముస్లిం-యాదవ-దళిత (ఎం వై డీ) ఓటర్లు 50 శాతం పైనే ఉన్నారు. నిజానికి యూపీలోని ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గం లోనూ ఎంవైడీ ఓటర్లు 40 శాతంపైనే ఉండడంతో వారి ఓట్లే నిర్ణయాత్మకం, విజయానికి కీలకం కానుందని ఒక సర్వే తేల్చింది. ఈసారి బీఎస్పీ-38, ఎస్పీ-37, ఆర్ఎల్డీ-3 సీట్లలో ఒక కూటమిగా పోటీచేస్తు, కాంగ్రెస్ కోసం అమేథి, రాయ్ బరేలి గౌరవపూర్వకంగా వదిలేశారని అభిప్రాయంగా ఉంది. వీరి విజయం కేవలం కులబలం పైనే ఆధారపడి ఉందన్నది నిస్సందేహం.
2011 జనాభా లెక్కల ప్రకారం యూపీలో మొత్తం 11 శాతం ముస్లింలు, 21 శాతం దళితులు ఉన్నారు. ఓబీసీ కులాలు ప్రతీ నియోజక వర్గానికీ మారుతూంటాయి. అందులో కూడా ఒక్క యాదవ కులస్థులే దాదాపు 10 శాతం ఉన్నట్లు అంచనా. మొత్తం ఓబీసీ లంతా కలిపి రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువే. దళితుల ఓట్లన్నీ తమవే అని బీఎస్పీ ధీమా ప్రకటిస్తుంటే, యాదవ-ముస్లిం ఓట్లు తమకే ఎక్కువగా పడతాయని ఎస్పీ చెబుతోంది. ఈ రెండు పార్టీలూ దోస్తీ కట్టడం వల్ల ఎంవైడీ ఓట్లను చీల్చడమెలా అన్నది ఇపుడు బీజేపీకి పెనుసవాలుగా మారింది. 80 సీట్లకు గాను పది నియోజకవర్గాల్లో ఎంవైడీ ఓట్లు 60 శాతం పైనే ఉన్నట్లు అంచనా.
2014లో అజంగఢ్ నుంచి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఎన్నికయ్యారు. అక్కడ మొత్తం ఎంవైడీ ఓట్లు 68.3శాతం. ములాయంకు మొత్తం 3.46 ఓట్లు లభించగా, అందులో 35.43 శాతం ఓట్లు ఎంవైడీ ఓట్లే! ఆనాడు మూడో స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి షా ఆలంకు 27.25 శాతం ఓట్లు లభించాయి. ఆ లెక్క ప్రకారం ఈసారి ఈ రెండు పార్టీలూ చేతులు కలపడం వల్ల కూటమికి 60 శాతంపైనే ఓట్లు పడాలన్నది సర్వే సారాంశం. 37 నియోజకవర్గాల్లో ఎంవైడీ జనాభా 50 నుంచి 60 శాతం మధ్య ఉంటుంది. వీటిలో రాహుల్ గాంధి పోటీచేసే, సోనియా పోటీచేసే రాయ్బరేలీ ఉన్నాయి.
ములాయం ఈసారి పోటీ చేసే మెయిన్ పురి (57.20 శాతం), ఇక మిగిలిన 33 నియోజకవర్గాల్లో ఎంవైడీ జనాభా 40 నుంచి 50 శాతం మధ్య ఉంది. వీటిలోనే ప్రధాని మోదీ పోటీచేసే వారణాసి నియోజకవర్గాలు ఉన్నాయి.