నిన్నమొన్నటి వరకూ కేరళలో శబరిమల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం రానురాను రాజకీయ రూపు దాల్చుకున్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులకు, హిందూత్వ సంస్థలకు మధ్య ఈ అంశంపై పెద్దఎత్తునే వాదనలు జరిగాయి. ఇదే సమయంలో కేరళలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి అందివచ్చిన అవకాశంలా మారింది.
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శబరిమల ఇష్యూ బీజేపీకి వరంలా మారిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయ్యప్పగుడిలోకి మహిళలు ప్రవేశించకుడా అడ్డుకునే భక్తులకు వెన్నదన్నుగా నిలుస్తామని ప్రకటించడం ద్వారా అమిత్ షా మళయాళీలను తమవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది.. కేరళీయుల్లో బీజేపీ పట్ల ఈ అంశం సానుకూలంగా మారిందని సమాచారం. శబరిమల వివాదం కేరళలో బీజేపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించగా.. అధికార ఎల్ డీఎఫ్ సర్కార్ సమర్థించింది. పినరయి విజయన్ సర్కారు కేరళతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ కేరళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.. ఈ ఎన్నికల్లో కేరళలో హిందువులు ఎన్డీఏ కూటమికి మద్దతిస్తారని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
శబరిమల వివాదంతో అయ్యప్ప భక్తుల్లోకి చొచ్చుకెళ్లగలిగితే.. లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపవచ్చని బీజేపీ బలంగా నమ్ముతోంది. సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ కోసం అయ్యప్ప భక్తులు తమతో నడిచి వచ్చేలా కార్యచరణ రూపొందించగలిగితే సగం విజయం సాధించినట్లేననే నమ్మకంతో కమల నేతలు ధీమాగా ఉన్నారు..సుప్రీం తీర్పుపై ఇప్పటి వరకు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ను వెయ్యకపోవడాన్ని బీజేపీ మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని ఆర్ఎస్ఎస్ నుంచి నేతలకు మార్గదర్శకాలు వెళ్లాయి..
కేరళలో భారతీయ ధర్మజనసేన, కేరళ కాంగ్రెస్ పార్టీలతో కలిసి బీజేపీ బరిలో దిగుతోంది. ఈ మేరకు బీజేపీ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ 14 లోక్ సభ నియోజకవర్గాల నుంచి బరిలోనిలవనుంది. బీడీజేఎస్ ఐదు స్థానాలు, కేరళ కాంగ్రెస్ ఓ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది.లోక్ సభ ఎన్నికల్లో కేరళ నుంచి బరిలో నిలిచేందుకు వీలుగా ఇటీవల మిజోరాం గవర్నర్ పదవికి కుమ్మనం రాజశేఖరన్ రాజీనామా చేశారు. తిరువనంతపురం లోక్ సభ నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న శశిథరూర్ పై బీజేపీ అభ్యర్థిగా కుమ్మనం రాజశేఖరన్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది.. అయోధ్య వివాదం కారణంగా బీజేపీ హిందువులను తమవైపు తిప్పుకుంది.. ఇప్పుడు శబరిమల ఇష్యూ కూడా మేలు చేస్తుందనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో.!