ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ లోక్సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. కీలకమైన అంశంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారుతున్నారు. ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా హాట్ టాపిక్గా ఉన్న తరుణంలో ఇలా ఆధారాలతో సహా బుక్కవడం పీవీపీని ఇరకాటంలో పడేస్తోంది.
వివరాల్లోకి వెళితే...ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్న పీవీపీ విజయవాడలో మార్చి 21 గురువారం కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రాష్ట్ర విభాగం నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా అంశం ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని...దానిపై తానేమీ మాట్లాడదలుచుకోలేదని పీవీపీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజకీయాలు అంతా ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్న తరుణంలో..పీవీపీ తీరు కలకలం సృష్టిస్తోంది.
2014లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దీంతో వైసీపీ పోరుబాట పట్టింది. కాగా, ఇదే సమయంలో బీజేపీతో దోస్తీ సాగించిన సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవిని కాదని..హోదా వస్తే అన్ని అయిపోవని వ్యాఖ్యానించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికి వచ్చి..ప్రత్యేక హోదా కోసం పోరాటం ప్రారంభించింది. ఇదే అంశంపై వైసీపీ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అలాంటి పార్టీ నేతగా పీవీపీ ఈ కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.