కర్నూల్ లో ఉండే చాలా మంది నేతలుకు టిక్కెట్ లు రాకపోయేసరికి వేరే పార్టీలోకి చేరిపోతున్నారు. ఇప్పటికే బుట్టా రేణుక వైసీపీలో చేరిపోయింది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డికి కూడా టిక్కెట్ ఇవ్వకపోయేసరికి వైసీపీలోకి చేరిపోతున్నాడు. నిజానికి, 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎస్వీ మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ జెండా మీదనే గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి పిరాయించారు. వైఎస్ జగన్ మీద నానారకాల విమర్శలూ చేసిన ఎస్వీ మోహన్రెడ్డి, చంద్రబాబు మెప్పుపొందేందుకు ప్రయత్నించారుగానీ.. చివరికి ఎస్వీ మోహన్రెడ్డి అవమానాలే ఎదుర్కొనాల్సి వచ్చింది.
సాక్షాత్తూ నారాలోకేష్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఓ దశలో ఎస్వీ మోహన్రెడ్డి మీసం మెలేశారు.. అంతలోనే ఆయన ఆనందం అటకెక్కింది. 'వైఎస్ జగన్కి అన్యాయం చేశా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మోసంచేశా.. నాకు తగిన శాస్తే జరిగింది.. నేను చేసిన పాపాన్ని కడుక్కునేందుకు తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను..' అంటూ ఎస్వీ మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. అన్నట్టు, ఎస్వీ మోహన్రెడ్డి, జనసేన పార్టీతోనూ టచ్లోకి వెళ్ళారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆయన మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.
పార్టీ ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే తయారైంది. టీడీపీలో చేరి నిండా మునిగిపోయామంటూ గగ్గోలు పెడ్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇది తగిన శాస్తే.! అన్నట్టు, ఎంపీ బుట్టారేణుక సైతం, వైఎస్ జగన్కి ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరితే, ఆమెకు చంద్రబాబు తన ట్రేడ్ మార్క్ షాక్ ఇచ్చేసరికి.. తిరిగి ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిపడ్డ విషయం తెల్సిందే. కర్నూలు జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.