ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోమారు ఊహించని రీతిలో వివాదంలో పడిపోతున్నారు. తన రాజకీయ గురువుగా ప్రకటించుకున్న నాయకుడికి ఆయన షాక్ ఇచ్చారని అంటున్నారు. బీజేపీ 182 లోక్సభ స్థానాలకు ప్రకటించి తొలి జాబితాలో అభ్యర్థుల పేరులో బీజేపీ అగ్రనేత, కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రస్తావన లేకపోవడం గురించి. గత 20 ఏళ్లుగా గుజరాత్ లోని గాంధీనగర్ సీటుని తన కంచుకోటగా మలచుకొని వరుసగా 5 పర్యాయాలు క్రమం తప్పకుండా విజయాలు సాధిస్తున్న ఎల్ కె అద్వానీకి బదులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ స్థానం నుంచి బరిలోకి దిగుతుండటంతో..అద్వానీ చాప్టర్ క్లోజ్ అయినట్లేనా అనే చర్చ తెరమీదకు వస్తోంది.
అద్వానీ కూడా కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వ వైఖరిపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాలలో మోడీ కూడా అద్వానీని దూరం పెడుతున్నట్టు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. తాజాగా టికెట్ ఇవ్వకపోవడం దానికి తార్కాణం అని అంటున్నారు.
అమిత్ షా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి పోటీ చేయడమంటే ప్రస్తుతం బీజేపీ ఈ స్థాయికి రావడానికి ఊపిరులూదిన అద్వానీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని సూచనప్రాయంగా చెప్పారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం 91 ఏళ్ల వయసున్న అద్వానీకి టికెట్ ఇవ్వకుండా బీజేపీ నాయకత్వం ప్రత్యక్ష రాజకీయాల నుంచి బలవంతపు రాజకీయ సన్యాసం ఇచ్చినట్టు పలువురు విశ్లేషిస్తున్నారు. తన గాడ్ఫాదర్ అని చెప్పుకొన్న వ్యక్తికే మోడీ షాక్ ఇచ్చారని ఇంకొందరు పేర్కొంటున్నారు.