ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ముఖ్య నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఈలోగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలకు ముఖ్య నేతలు జంప్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు పూర్తి స్థాయిలో ఖరారు చేసిన వారు నామినేషన్ వేయడంలో బిజీ అయ్యారు. నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. నేటి ఉదయం 9 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్ మొదట భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ అధినేత జగన్ నామినేషన్ వేసే సందర్బంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రానున్నారు.
తమ నాయకుడికి తిరుగులేదని..వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందులలో రిటర్నింగ్ అధికారికి మధ్యాహ్నం 1.40 నుంచి 1.49 నిమిషాల మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో భారీగా కోలాహలం కనిపిస్తోంది.