బీజేపీ యుద్ధక్షేత్రంలోకి దిగింది. లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోయే 182 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే బీజేపీ ఆద్యుల్లో ఒకడిగా భావించే లాల్ కృష్ణ అద్వానీ పేరు జాబితాలో లేకపోవడం యావత్ దేశాన్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీ నగర్ నుంచి ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బరిలోకి దిగబోతున్నారు. ఇంతకూ అద్వానీని మోదీ-షా ద్వయం తిరస్కరించిందా? అద్వానీయే స్వచ్చందంగా తప్పుకున్నారా..?
బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అద్వానీ పేరు లేదు. పైగా ఆయన ప్రాతినిధ్యం
వహిస్తున్న గాంధీ నగర్ నుంచి అమిత్ షా బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించింది. గత 20 ఏళ్లుగా గుజరాత్
లోని గాంధీనగర్ సీటుని తన కంచుకోటగా మలచుకొని వరుసగా 5 పర్యాయాలు క్రమం తప్పకుండా విజయాలు సాధిస్తున్న అద్వానీకి
ఈసారి బరిలోకి దిగట్లేదు. అమిత్ షా రాకతో బీజేపీకి ఊపిరులూదిన అద్వానీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని
టాక్.
భారతీయ జనతా పార్టీని ఇటుక మీద ఇటుక పేర్చి నిర్మించడమే కాదు రెండున్నర దశాబ్దాల పాటు పార్టీని కనుసైగలతో శాసించిన నేత అద్వానీ. బీజేపీ తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న అద్వానీ.. అన్నీ తానై భీష్మాచార్యులుగా ఉన్న అగ్రజుడు. బీజేపీ అంటే అద్వానీ, అద్వానీ అంటే బీజేపీగా పార్టీ ఆవిర్భావం నుంచి భారతీయ జనతా పార్టీకి పర్యాయపదంగా మారారు. ఒకప్పుడు రథయాత్ర ద్వారా బిజెపికి అధికారాన్ని కట్టబెట్టి కింగ్ మేకర్ అయిన అద్వానీ.. షా- మోడీ ద్వయం పార్టీ పగ్గాల తర్వాత అదే పార్టీలో ఎవరిని శాసించలేని జీరో అయ్యే పరిస్థితి నెలకొంది. పేరుకి పెద్దల కోసం, మీ సలహాలే మాకు శిరోధార్యం అంటూ మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి అద్వానీ లాంటి కొందరిని అందులో సభ్యులు చేసి కూర్చోబెట్టారు. అద్వానీ ఒక్కరేకాదు.. మండలిలో వాజపేయి, జోషి లాంటి వారి సలహాలను మోడీ-షా ద్వయం ఎంతవరకు విన్నారన్నది వారికే తెలియాలి.
బీజేపీని పాతాళం నుండి అధికారంలోకి తెచ్చిన ఘనత అద్వానీదే కాగా ఇంత చేసినా ప్రధాని పదవి మాత్రం ఆయనను వరించలేదు. ఆ మాటకొస్తే భారతదేశ రాజకీయాల్లో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్రనేత అద్వానీకి అదృష్టం ఎప్పుడూ కలిసిరాలేదు. పార్టీని అధికారంలోకి తెచ్చినా పదవిని సీనియర్ నేత అటల్ బిహారీ వాజపేయి తన్నుకుపోయారు. రథయాత్ర బిజెపికి వరమైతే వ్యక్తిగతంగా అద్వానిని కరడుగట్టిన హిందుత్వ వాదిగా మార్చింది. ఈ కారణంగానే ఆయన అత్యున్నత పదవికి దూరం అయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రామమందిర వివాదం, మహమ్మద్ అలీ జిన్నాను సెక్యులరిస్టుగా పొగడడం ఎన్నో అంశాలతో పార్టీ అధ్యక్ష పదవి పోవడం, ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఎంపిక కాకపోవడం వంటి పరిస్థితులతో సమర్థించేవారు లేక అద్వానీ ఒంటరైపోయారు.
ఇక మోడీ అధికారం చేపట్టాక.. పార్టీ పూర్తిగా మోడీ-షా ద్వయం ఆజ్ఞలతోనే నడుస్తుండంతో అద్వానీ కూడా కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. మోడీ-షాల నాయకత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం, అసహనం సన్నిహితులతో చెప్పుకోవడం, పలు సందర్భాలలో మోడీ కూడా అద్వానీని దూరం పెడుతున్నట్టు ప్రత్యక్షంగా సూచనలు కనిపించడం అన్నీ దేశ రాజకీయాలలో అద్వానీ స్థానంపై స్పష్టమైన అవగాహనలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు ఐదుసార్లు అయనను పార్లమెంటుకు నడిపించిన గాంధీ నగర్ నుండి అయనను తప్పించడంతో బీజేపీ నాయకత్వం ఆయనను ప్రత్యక్ష రాజకీయాల నుంచి బలవంతపు రాజకీయ సన్యాసం చేసినట్లుగానే ఉంది.
అయితే అద్వానీయే తనకు టికెట్ వద్దన్నారని మోదీ-షా ద్వయం చెప్పుకుంటోంది. అద్వానీ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. కానీ అంతర్గత అంశాల ప్రకారంవయసుమీద పడడం వల్లే అద్వానీని బరిలోంచి తప్పించారని సమాచారం. అయితే దీనిపై అద్వానీ నోరు మెదిపితే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశమే లేదు.