దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి తన తండ్రి మరణంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి తన తండ్రి మరణం దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి హత్యను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తులు ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, తమ అన్న జగన్ మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసీ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరగాలని ఆకాంక్షించారు.
వివేకానందరెడ్డి హత్యపై జరుగుతున్న సిట్ విచారణ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చర్చలు తీసుకోవాలంటూ సునీతారెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే ఢిల్లీ వచ్చి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందని సునీతా రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ``సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది కాబట్టి విచారణ పాదర్శకంగా జరగటం లేదు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు, డీజీపీ, సీఎం చంద్రబాబుకు వివరాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రే తప్పుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాలన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం.`` అని వెల్లడించారు. కేంద్ర హోంశాఖను కలివాలనీ ఈసీ సూచించిందని పేర్కొన్న సునీతారెడ్డి త్వరలో హోంశాఖను కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతామని సునీతా రెడ్డి వెల్లడించారు.