కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముక్కు సూటి మనిషి ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడుతారు. ఎవరి మీద నైనా ఇట్టే ఫైర్ అవుతారు. తాజాగా మోహన్ బాబు ఫీజు రీ-ఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని బకాయిలు చెల్లించలేదని తిరుపతిలో ధర్నాకు దిగారు. చంద్రబాబుది నీచబుద్దని, అహంకారి అని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేననీ, ఆయన నోట నిజాలు రావనీ తేల్చేశారు. ఫీజు రీ-ఎంబర్స్మెంట్ బకాయిలు ఇస్తానని చెప్పి, మోసం చేశావంటూ మోహన్బాబు, చంద్రబాబుపై ఆరోపించారు.
ఈ క్రమంలో, రాజకీయ విమర్శలు చేయనంటూనే రాజకీయాలు మాట్లాడక తప్పలేదు మోహన్బాబుకి. మరీ ముఖ్యంగా, 'వెన్నుపోటు' అంశంపై మోహన్బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ విషయంలో ఏం చేశారో చంద్రబాబు చూశాం, అలాంటి చంద్రబాబుకి ప్రజల్ని మోసంచేయడం పెద్ద కష్టమేమీ కాదని మోహన్బాబు అన్నారు. కొన్నాళ్ళ క్రితం.. 'ఎన్టిఆర్ బయోపిక్' ప్రీరిలీజ్ ఫంక్షన్లోనే మోహన్బాబు, స్వర్గీయ ఎన్టీఆర్ గురించి 'నిజాలు' మాట్లాడదామనుకున్నారుగానీ, బాలయ్య మీద గౌరవంతో అప్పటికి ఆ అంశం గురించి టచ్ చేయకుండానే ప్రసంగం పూర్తికానిచ్చేశారు.
'నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు' అనేశారాయన అప్పట్లో. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబుని మోహన్బాబు, వందలాది మంది విద్యార్థుల సాక్షిగా కడిగిపారేశారు. ఇది ఎన్నికల సీజన్.. ఈ టైమ్లో మోహన్బాబు, ఫీజు రీ-ఎంబర్స్మెంట్ బకాయిల కోసం చేపట్టిన దీక్ష, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 'మోహన్బాబు, జగన్ కుమ్మక్కయ్యారు.. లేకపోతే, ఎన్నికల సమయంలో ఈ దీక్షలేంటి.? చేతనైతే, మోహన్బాబు, వైసీపీ జెండా పట్టుకుని తిరగాలి..' అంటూ టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు.