తెలంగాణలో బరిలో దిగే బీజేపీ అభ్యర్థుల విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 184 అభ్యర్థు లతో బీజేపీ గురువారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో రాష్ట్రం నుంచి 10 సీట్లు ఉన్నాయి. బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఏకైక సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్. ఇప్పటి వరకు ఇక్కడ దత్తాత్రేయ ఎంపీగా ఉన్నారు. అయితే, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థానంలో ఆ సీటును బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి కేటాయించింది. దీంతో కిషన్రెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నారు. అయితే, ఆయనకు ఈ పోరు కలిసి వస్తుందా? అనే చర్చ మొదలైంది.
రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో పది సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మరో ఏడు సీట్లను పెండింగ్లో పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన డీకే అరుణకు మహబూబ్ నగర్ టికెట్ ఖరారు చేసింది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డికి ఇచ్చింది. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఎమ్మెల్సీ రాంచందర్రావును ఖరారు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బండి సంజయ్కి ఈ దఫా కరీంనగర్ ఎంపీ సీటు దక్కింది. మొదటి నుంచి నిజామాబాద్ లోక్ సభ స్థానంపై గురిపెట్టిన ధర్మపురి అరవింద్కు అదే సీటు ఖరారైంది.
ఇక సికింద్రాబాద్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాస్తవంగా ఈ దఫా సికింద్రాబాద్ నియోజకవర్గం విషయంలో బీజేపీలో గట్టి పోటీ ఎదురైంది. సికింద్రాబాద్ టికెట్ విషయంలో పార్టీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్రెడ్డి పోటీ పడగా.. చివరికి కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓడిపోయిన కిషన్రెడ్డి ఈ పోరులో గెలుస్తారా? దత్తాత్రేయ చేసిన త్యాగానికి విలువ ఉంటుందా? అనేది తేలాలంటే...మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.