కారు..సారు...పదహారు నినాదంతో రాష్ట్రంలోని 16 లోక్సభా స్థానాల్లో తిరుగులేని విజయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఇందుకు తగిన కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచార భేరి మోగించేందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. 6 రోజుల్లో తెలంగాణలోని 13 లోక్సభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా సుడిగాలి పర్యటనలకు సై అన్నారు.
ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్లలో గులాబీదళపతి కేసీఆర్ ప్రచారం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 29నుండి మలివిడత ప్రచారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మిషన్-16లక్ష్యంగా తెలంగాణను చుట్టేయనున్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సభ ఈనెల 29న సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడలో జరగనుండగా, అదేరోజు సాయంత్రం మల్కాజగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సభ ఎల్బి స్టేడియంలో సాయంత్రం 5:30కు నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రసంగాలకు ప్రజలనుండి పెద్ద ఎత్తున స్పందన రాగా, కేసీఆర్ జాతీయ రాజకీ యా ల్లో కీలకభూమిక పోషించడం ఖాయమన్న ధీమా గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇదిలాఉండగా, ఈనెల 30నుండి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రోడ్షోలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 30నుండి ఏప్రిల్ 9వరకు చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో రోడ్షోలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయానేతలకు ప్రచారంపై కేటీఆర్ సూచనలు అందజేశారు.