రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు వంటి విజయవాడలోని మూడు కీలకమైన నియోజకవర్గాల్లో ముఖ్యమైంది.. బెజవాడ తూర్పు. కమ్మ సామాజికవ ర్గం బలం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రతి పార్టీ కూడా కమ్మ వర్గానికే ప్రాతినిధ్యం ఇస్తుంది. పారిశ్రామికంగా, వినోద పరంగా, వాణిజ్య పరంగా కూడా ఈ నియోజవకర్గం అత్యంత కీలకం. అదేసమయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసే నాయకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2008లో నియోజకవర్గం పునర్విభజన జరగకముందు వరకు అన్ని సామాజిక వర్గాలకు ఇక్కడ ప్రాతినిథ్యం ఉండేది. ఈ క్రమంలోనే బ్రాహ్మణ వర్గానికి చెందిన కోట శ్రీనివాసరావు సహా కాపు వర్గానికి చెందిన వంగవీటి రాధా కూడా ఇక్కడ నుంచి గెలుపొందారు.
అయితే, నియోజకవర్గం పునర్విభజన తర్వాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. కేవలం కమ్మ వర్గానికి చెందిన నాయకులే ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన యలమంచిలి రవి ఇక్కడ విజయం సాధించారు. అదేఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్, టీడీపీ తరఫున కమ్మ వర్గానికి చెందిన దేవినేని నెహ్రూ. గద్దె రామ్మోహన్లు తలపడ్డారు. వీరి ముగ్గురికి కూడా 50 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. అయితే, కేవలం 190 ఓట్ల మెజారిటీతో యలమంచిలి రవి విజయం సాధించారు. ఇక, 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఆయనకు మృదు స్వభావి, వివాద రహితుడు, అవినీతి లేని వ్యక్తిత్వం వంటివి కలిసి వస్తున్నాయి.
ఇక, ఇప్పుడు వైసీపీ తరఫున కమ్మ వర్గానికే చెందిన బొప్పన భవకుమార్, టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె లే పోటీ చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ తరఫున నాంచారయ్య, జనసేన తరఫున బత్తిన రాములు బరిలో నిలిచారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం గద్దె వర్సెస్ బొప్పనల మధ్యే ఉంటుంది. గద్దె విషయాన్ని తీసుకుంటే.. సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. అయితే, నియోజకవర్గంలో ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదనే పేరు ఉండడం, తనకు ఎంపీగా వెళ్లాలని ఉన్నా.. బాబు కోరిక మేరకు ఎమ్మెల్యేగా చేస్తున్నానని ప్రకటించడం, నిధుల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి తేలేకపోవడం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఇక, బొప్పన విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు, విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న పీవీపీ నుంచి దన్ను పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ నువ్వా నేనా అనేరేంజ్లో పోరు సాగనుందని అంటున్నారు పరిశీలకులు. ఎవరు గెలిచినా.. కూడా వందల తేడాలోనే ఉంటుందని అంటున్నారు.