రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గం నందిగామ. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో దీనికి ముందు అంటే, 1994 నుంచి, తర్వాత ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత కూడా ఇక్కడ టీడీపీనే గెలుపు గుర్రం ఎక్కు తోంది. మెజారిటీతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలు అంతిమంగా ఈ సీటును టీడీపీ ఖాతాలోనే వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తంగిరాల ప్రభాకరరావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీనికి ముందు జరిగిన ఎన్నిక ల్లోనూ ఆయనే విజయం సాధించారు. వాస్తవానికి మంత్రి దేవినేని ఉమా సొంత నియోజకవర్గం ఇదే. అయితే, ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఆయన మైలవరానికి షిప్ట్ అయ్యారు.
2014లో తంగిరాల ప్రభాకర్ విజయం సాధించిన కొద్ది నెలలకే మరణించడంతో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య అప్ప ట్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆమెకే టీడీపీ అధినేత టికెట్ను ఖరారు చేశారు. ఇక, వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎం. జగన్మోహన్రావుకే టికెట్ కేటాయించారు. అదేసమయంలో కాంగ్రెస్ కూడా పార్టీనే నమ్ముకుని పోటీ చేస్తున్న వేల్పుల పరమేశ్వర్కే టికెట్ కేటాయించింది. ఇక, జనసేన నుంచి బి. పుష్పరాజ్, బీజేపీ తరఫున జంగం సునీల్ రాజు పోటీ చేస్తున్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యే ఉంటుంది. కానీ, ఓట్లుమాత్రం భారీ ఎత్తున చీలిపోతాయని అంటున్నారు.
ఇక, ప్రధాన పార్టీలకు చెందిన నేతల బలాల ను పరిశీలిద్దాం. వరుస విజయాలు సాధిస్తున్న తంగిరాల కుటుంబంపై గతంలో ఉన్న సింపతి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి పనికీ.. మంత్రి దేవినేనిపై ఆధారపడుతున్న ఎమ్మెల్యే సౌమ్యపై నియోజకవర్గంలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. నిధులు తేవడంలోను, అభివృద్ధి చేయడంలోను కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే, కలిసి వస్తున్న ప్రధాన విషయం మహిళా సెంటిమెంట్. తనను మరోసారి దీవిస్తే.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తుండడం. ఇక, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న జగన్మోహన్రావుకు సింపతి పెరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజల్లోనే ఉండడం, ప్రజల సమస్యలపై స్పందించడం, జగన్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడం వంటివి కలిసి వస్తున్నాయి. అయితే, పార్టీలు అభ్యర్థులు పెరిగిన నేపథ్యంలో సంప్రదాయ ఓటు బ్యాంకు చీలుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.