ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఒరవడి ఓ వైపు కొనసాగుతుండగా....మరోవైపు పార్టీకి చెందిన సీనియర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భిక్షమయ్య మాట్లాడుతూ, తను రెండు సార్లు ఓడిపోవడానికి కోమటిరెడ్డి సోదరులే కారణమని బిక్షమయ్య వెల్లడించారు. పార్టీలో బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. తన అనుచరులతో కలిసి త్వరలో టీఆర్ఎస్లో చేరుతానన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇదిలాఉండగా, భువనగిరి లోక్సభ టిక్కెట్ తనకు దక్కుతుందని భిక్షమయ్య గౌడ్ ఆశించారు. అయితే తనను కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున, టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్యగౌడ్ బరిలో దిగిన సంగతి తెలిసిందే.