టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేక నిర్ణ‌యాల‌కు పెట్టింది పేర‌యిన గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా రైతుల‌కోసం మ‌రో భారీ ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ‘రైతు సమగ్ర సర్వే’కు కేసీఆర్ ఓకే చెప్పారు. 20 రోజుల పాటు ఈ వివ‌రాలు సేక‌రించ‌నున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతుల కచ్చితమైన వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. దీంతో పథకాల రూపకల్పనలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఓ డేటాబేస్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల 25 నుంచి మే 15లోగా రాష్ట్రంలోని 54లక్షలకుపైగా ఉన్న రైతుల వివరాలు సేకరించనుంది . ఇందుకు 39 అంశాలతో ఫార్మాట్‌ రూపొందించారు. ప్రతి ఏఈఓ తమ పరిధి గ్రామాల్లోని రైతుల వివరాలను ట్యాబ్స్ లోని ప్రత్యేక పోర్టల్ లో అప్ లోడ్ చేయ‌నున్నారు. 


తాజా స‌ర్వేలో విస్తృతంగా స‌మాచారం సేక‌రించ‌నున్నారు. రైతుల ఆధార్‌ కార్డు వివరాలతో సహా రైతుల విద్యార్హత, పండించే పంటలు, నీటి వసతి, నేలల రకాలు, వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం, పంట రుణాలు, పంట బీమా, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలను సేకరిస్తారు. సర్వే విశ్లేషించి నిర్ణయాలు సర్వే వివరాలను విశ్లేషించి ఏ ప్రాంతంలో ఏ నేలలున్నాయి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయాలి..తదితర అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు చేయనున్నారు. ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి ఆయా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయ‌నున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: