``దేశానికి నేనూ చౌకీదారుని. ప్రతిఒక్క మద్దతుదారు అండగా నిలవాలి`` అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతోపాటు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ట్విట్టర్లో తమపేరు ముందు చౌకీదార్ అనే పదాన్ని చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ ప్రచారంపై మోడీకి మంట పుట్టించే కామెంట్లు చేశారు.
తాను చౌకీదార్ను కాలేనని, ఎందుకంటే తాను బ్రాహ్మణుడిని అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. బీజేపీ నేతల వలే ట్విట్టర్లో తన పేరు ముందు చౌకీదార్ అని పెట్టుకోలేనని సుబ్రమణ్యస్వామి ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ``నేను బ్రాహ్మణుడిని. అందుకే చౌకీదార్ను కాలేను. బ్రాహ్మణులు ఎప్పటికీ చౌకీదార్లు కాలేరు. ఇది వాస్తవం. నేను ఇచ్చే ఆదేశాలను చౌకీదార్ అమలుచేయాలి. చౌకీదార్లను నియమించుకునే వారంతా అదే ఆశిస్తారు. అందుకే నేను చౌకీదార్లలో ఒకరిని కాలేను`` అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.
సుబ్రమణ్యస్వామి తన హాట్ కామెంట్లను ఇంతటితోనే ఆపేయలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఆర్థికరంగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. జీడీపీ పరంగా మనదేశం అమెరికా, చైనా తర్వా త ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నదని, మోదీ మాత్రం భారత్ను ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అని చెబుతుంటారని.. ఇలా ఆయన ఎందుకు అంటుంటారో అర్థం కావటం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.