ఎన్నికలకు సంబంధించి
మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి బాణంగా పాపులరైన సోదరి వైఎస్ షర్మిల నోరిప్పారు. ఉత్తరాంధ్రలో
పార్టీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేస్తారని అందరూ ఎదురుచూస్తుంటే షర్మిలేమో
మీడియా ముందు హాజరయ్యారు. దాదాపు 40 నిముషాల పాటు మాట్లాడిన ఈ బాణం జనసేనకు
ఓటేస్తే తెలుగుదేశంపార్టీకి ఓట్లేసినట్ల అని స్పష్టం చేశారు.
షర్మిల మీడియా ముందుకు రావటం తక్కువనే చెప్పాలి. అలాంటిది ఎన్నికల వేడి బాగా రాజుకుంటున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఒకేసారి అటు చంద్రబాబునాయుడును ఇటు పవన్ కల్యాణ్ ను ఉతికారేశారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలన కడిగిపారేశారు. ‘మీ భవిష్యత్తు..నా బాధ్యత’ అనే ఎన్నికల స్లోగన్ ను తూర్పారబట్టారు.
పోయిన ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబుకు ప్రజల భవిష్యత్తు తన బాధ్యతగా గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుకు జనాల భవిష్యత్ తన బాధ్యతగా గుర్తుకొచ్చిందా ? అంటూ మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, రాజధాని రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడుతూ, ఎంఆర్ఓ వనజాక్షిని టిడిపి ఎంఎల్ఏ కొట్టటం, అధికారులపై టిడిపి ప్రజా ప్రతినిధులు దాడులు చేయటం లాంటి అంశాలను గుర్తుచేశారు.
ఇక పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ ముసుగులో ఇద్దరు టికెట్లు ఇచ్చిపుచ్చుకోవటాన్ని ఎత్తిచూపారు. చంద్రబాబును సిఎం చేయటానికే పవన్ కష్టపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. టిడిపి అభ్యర్ధులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన బలహీన అభ్యర్ధులను నిలబెట్టటాన్ని ఎత్తిచూపారు. ప్రత్యేకహోదా గురించి చంద్రబాబు, పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ చేస్తున్న కామెడీ ప్రకటనలను కూడా ప్రస్తావించారు. మొత్తం మీద చంద్రబాబు, పవన్ ఒకటే అంటూ తేల్చేశారు. ఓటేసేముందు ఎవరికేస్తే భవిష్యత్ బాగుపడుతుందో ఆలోచించుకుని ఓట్లేయమని సామాన్యురాలిగా అభ్యర్ధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.