లోకేష్ ఎప్పుడైతే తన ఎమ్మెల్సీ కి రాజీనామా చేయకుండా మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో అప్పటి నుంచి విమర్శల జోరు పెరిగింది. మంగళగిరి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి అక్కడ పోటీలో ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు గట్టి సవాల్ విసిరారు. లోకేష్ కు దమ్ముంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఎమ్మెల్యేగా పోటీకి రావాలని సదరు ట్రాన్స్ జెండర్ చాలెంజ్ చేశారు.
తను జనసేన పార్టీ తరఫున పోటీచేసే ప్రయత్నం చేసినట్టుగా అయితే అక్కడ అవకాశం దక్కలేదని ఆమె చెప్పారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు. నారాలోకేష్ బాబు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోవడంపై మొదటి నుంచి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండిన రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటివాళ్లు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో సీరియస్ గా కాన్సన్ ట్రేట్ చేయడానికి.. వాళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే లోకేష్ మాత్రం అంత ధైర్యం చేయడం లేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా ఎన్నికలను ఎదుర్కొంటూ.. లోకేష్ ఇలా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారు. చివరకు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా.. లోకేష్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిరావాలని సదరు ట్రాన్స్ జెండర్ ఇండిపెండెంట్ సవాల్ విసిరారు. మరి దీనికి లోకేష్ స్పందిస్తారా?