క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇపుడిదే అనుమానం
వస్తోంది. హిందుపురం లోక్ సభ నుండి మాధవ్
ను పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వం ఆలోచనే చాలా చవకబారుగా ఉంది.
రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తే పనికిమాలిన
కారణాలతో తొక్కిపెట్టాలని ప్రభుత్వం
చూడటమే ఓటమికి మొదటిమెట్టుగా తేలిపోయింది.
ఆమధ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోని ఓ ఆధ్యాత్మిక సంస్ధ కేంద్రంగా జరిగిన గలాటాలో టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కదిరి సిఐగా ఉన్న మాధవ్ వెంటనే జేసికి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు. జేసి నాలుకను చీరేస్తానంటూ ఇచ్చిన వార్నింగ్ అప్పట్లో సంచలనమైంది. ఆ గలాటా ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి కంట్లో మాధవ్ పడ్డారు. వెంటనే పార్టీలోకి పికప్ చేయటమే కాకుండా హిందుపురం ఎంపిగా పోటీలోకి నిలబెట్టారు.
పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్ వైసీపీ తరపున పోటీ చేయటమే చంద్రబాబునాయుడుకు నచ్చలేదు. అందుకనే గోరంట్ల చేసిన రాజీనామాను తొక్కిపట్టిఉంచారు. ఎందుకేంటే, హిందుపురం లోక్ సభలో టిడిపికి ప్రత్యర్ధిగా గట్టి అభ్యర్ధి నిలబడలేదు. హిందుపురం నియోజకవర్గంలో బిసి సామాజికవర్గం ఓట్లే చాలా ఎక్కువ. అందులోను బిసిల్లో కూడా కురబ ఉపకులం ఓట్లు ఇంకా ఎక్కువ. మాధవ్ ఆ కురబ ఉపకులం వ్యక్తి కావటమే టిడిపి ఉలికిపాటుకు కారణమైంది.
మాధవ్ పోటీలో ఉంటే ఓటమి ఖాయమని టిడిపి నేతలు నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకనే ఎలాగైనా మాధవ్ రాజీనామాను ఆమోదించకుండా తొక్కిపెట్టి పోటీకి దూరం చేయాలని అనుకున్నట్లు అర్ధమవుతోంది. విచిత్రమేమిటంటే, మాధవ్ రాజీనామాను తొక్కిపెడితే వైసిపి గెలుపును ఆపగలదా టిడిపి ? రాజీనామా ఆమోదించే విషయంలో ముందు ట్రైబ్యునల్ తర్వాత కోర్టు నుండి మాధవ్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. చూడబోతే ప్రభుత్వమే మాధవ్ ను ఎన్నికకు ముందే హీరోను చేసినట్లైంది.