`పప్పు` అంటూ ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పంచ్లు పేలుతున్న సంగతి తెలిసిందే. సందర్భం ఏదైనా దానికి లోకేష్ను నవ్వుల పాలు చేయడమే లక్ష్యం అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈ దోరణి కొనసాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు కానీ లోకేష్పై పెద్ద ఎత్తున ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు.
మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా లోకేష్ను ఓ మీడియా చానల్ సంప్రదించింది. అనేక అంశాలపై స్పందించిన తర్వాత పప్పు ప్రశ్న అడిగింది. ``మిమ్మల్ని పప్పు అంటూ ఎద్దేవా చేస్తుండటంపై మీ స్పందన ఏంటి?`` అని సదరు మీడియా సంస్థ ప్రశ్నించగా....``అదంతా వైసీపీ నాయకుల ప్రచారం. వైసీపీ నాయకులకు వేరే పని లేదు. అందరికీ పేర్లు పెడతారు. వాళ్లందరినీ ఒక్కటే. ఏపీకి ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను. నా శాఖల పరంగా ఎన్నో అవార్డులు సాధించాను. ప్రజల్లో ఉన్నాను, ప్రజల మనిషిని. నేను చేస్తున్న పనికి వాళ్లు నన్ను పప్పు అంటే అది వాళ్లిష్టం`` అంటూ తనపై వస్తున్న సెటైర్లకు లోకేష్ స్పందించారు.
సోషల్ మీడియాలో తన కేంద్రంగా జరుగుతున్న సెటైర్లపై స్పందించిన నారా లోకేష్ ఈ సందర్భంగానే తన వ్యక్తిగత అంశాల గురించి కూడా రియాక్టయ్యారు. తనకు కుటుంబాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందని లోకేష్ తెలిపారు. రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబ జీవితాన్ని మిస్ అవ్వడం తప్పదని చెప్పారు. కుమారుడు దేవాన్ష్కు సంబంధించిన వీడియోలను తనకు తన భార్య బ్రాహ్మణి పంపుతుంటుందని, ఆ రకంగా కొంత లోటు తీరుతుందని పేర్కొన్నారు.