ఇంతకాలం
ప్రత్యర్ధుల్లోని భయం ఆధారంగానే అనంతపురం
జేసి బ్రదర్స్ రాజకీయాలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తాడిపత్రి అసెంబ్లీలో
జేసి బ్రదర్స్ ఎంఎల్ఏలుగా గెలుస్తునే ఉన్నారంటే అందుకు కారణం సరైన ప్రత్యర్ధి
ఎదురుపడక పోవటమే. జేసి బ్రదర్స్ ను ఎదిరించి నిలబడే మొనగాడు లేకపోవటంతోనే చాలామంది
జేసిల ఆధిపత్యానికి తలొంచారు.
అయితే ప్రస్తుత ఎన్నికలు జేసి బ్రదర్స్ ఆధిపత్యానికి గండికొట్టేట్లుగానే కనిపిస్తోంది. తాడిపత్రిలో సిట్టింగ్ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి ఆధిపత్యానికి వైసిపి అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాలుగా నిలబడ్డారు. జేసిలను ఢీ అంటే ఢీ అంటున్నారు. నాలుగేళ్ళ క్రితమే జగన్మోహన్ రెడ్డి తాడిపత్రిలో పెద్దారెడ్డి అనే గట్టి నేతను వెతికి మరీ పట్టుకున్నారు. అప్పటి నుండి జేసిల పీఠం కదులుతున్నట్లే అనిపిస్తోంది.
అప్పటి వరకూ తాడిపత్రిలో జేసిలను ఎదిరించి ప్రత్యర్ధి పార్టీ జెండాను ఎగరేసిన వాళ్ళే లేరంటే అతిశయోక్తి కాదు. కానీ నాలుగేళ్ళుగా ఎక్కడబడితే అక్కడ జేసి బ్రదర్స్ ను పెద్దారెడ్డి సవాలు చేస్తున్నారు. సవాలు చేయటమే కాకుండా వాళ్ళ వర్గాలతో నేరుగా ఢీ కొంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోను తిరుగుతూ వైసిపి జెండాలను ఎగరేస్తున్నారు. దాంతో జేసి బ్రదర్స్ అంటే పడని వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా పెద్దారెడ్డికి దగ్గరయ్యారు.
అదే సమయంలో ఒంటెత్తు పోకడలతో జేసి బ్రదర్స్ కూడా తన మద్దతుదారులను కోల్పోయారు. ప్రభాకర్ రెడ్డికి గట్టి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళల్లో చాలామంది ఇపుడు వైసిపిలో చేరిపోయారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జేసి అస్మిత్ రెడ్డి గెలుపు అంత ఈజీ అయితే కాదు. అదే సమయంలో అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డికి కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. పార్టీలోని ఎంఎల్ఏలు ప్రబాకర్ చౌధరి, జితేంద్రగౌడ్ లాంటి వాళ్ళు గట్టిగా జేసిని వ్యతరేకిస్తున్నారు.
జనాలు కూడా జేసి బ్రదర్స్ వైఖరితో విసిగిపోయున్నారు. వారిని ఎదిరించే గట్టి ప్రత్యర్ధుల కోసం ఎదురుచూస్తున్న జనాలకు వైసిపి రూపంలో ప్రత్యామ్నాయం కనబడింది. దాంతో వైసిపి అభ్యర్ధులకు నియోజవకర్గాల్లో బాగా ఆధరణ కనబడుతోందట. అంటే జేసి బ్రదర్స్ కు బయట ప్రత్యర్ధులే కాకుండా పార్టీలోనే బలమైన ప్రత్యర్ధులు తయారయ్యారు. దానికితోడు ప్రభుత్వంపై జనాల్లో పెరిగిన వ్యతిరేకత. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను గమనిస్తే జేసిల ఆధిపత్యానికి ప్రత్యర్ధులు గట్టి సవాలు విసురుతున్నట్లే కనిపిస్తోంది.