తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి జనార్ధన్ ధాట్రాజ్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కుల ధ్రువీకరణ పత్రంలో తేడా ఉండటంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు.
విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జనార్ధన్ను పార్టీ ఎంపిక చేసింది. పార్టీ బీఫాంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, జనార్ధన్ ధాట్రాజ్ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్, బీజేపీకి చెందిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన అధికారి విశ్వేశ్వరరావు జనార్ధన్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో టీడీపీ నాయకులు, శ్రేణులు నిరాశగానే వెనుదిరిగారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలోల పోటీ చేస్తున్న వ్యక్తి ఇలా రాజ్యాంగాన్ని తప్పుపట్టేలా వ్యవహరించడం ఏంటని టీడీపీ నేత తీరును పలువురు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ సైతం ఆయనకు అవకాశం కల్పించే ముందు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిందని కొందరు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికలకు ముందే అధికార టీడీపీకి భారీ షాక్ తగిలిందని చర్చించుకుంటున్నారు.